రాయలసీమపై కన్నేసిన నారా లోకేష్, కోస్తాంధ్రపై జగన్ దృష్టి
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టున్న రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దృష్టి సారించారు. స్వయంగా రంగంలోకి దిగిన నారా లోకేష్ సోమవారం పార్టీ పటిష్టతపై ఆయా జిల్లాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మొన్నటి వరకు ఖాళీగా ఉన్న జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శలకు అప్పగించారు. ఏపీలో రాయలసీమ వైసీపీకి పెట్టని కోటలాగా ఉంది. ఇప్పుడు దానిపై దృష్టి సారిస్తే 2019 ఎన్నికల కల్లా పార్టీని పటిష్టం చేయవచ్చనే ఆలోచనగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు.
మరోవైపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీని పటిష్టం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జమ్మల మడుగు టిడిపి ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డితో బాలకృష్ణ, లోకేష్ చర్చలు జరిపారని సమాచారం.
అయితే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీలోకి ఆదినారాయణ రెడ్డి చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడటంతో ఈ విషయం అలా ఆగింది. మరోవైపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి పట్టున్న కోస్తాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయా జిల్లాల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా చూసేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలనే అంశంపై జగన్ పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.