కరోనా, విశాఖ గ్యాస్ లీకేజీపై జగన్ సమీక్ష: కీలక ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం చర్యలు కొనసాగిస్తూ కేంద్ర మార్గదర్శకాల అనుగుణంగా దుకాణాలు తెరిచేలా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి, లాక్డౌన్ తర్వాత అనుసరించాల్సిన ప్రణాళికలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జగన్ సమీక్షించారు.

విదేశాల్లోనివారు వెనక్కి..
విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందినవారు సోమవారం నుంచి స్వదేశానికి తిరిగి వస్తారని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. అమెరికా నుంచి వచ్చేవారు ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారని, అలా వచ్చే వారందరినీ విశాఖ, విజయవాడ, తిరుపతిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. వారందరికీ ఉచితంగా వసతులూ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లోనివారికి పరీక్షలు..
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేసి అనంతరం వారిని వైద్యుల పరీశీలనలో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్ పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన వారు అనుమతి పొందినా, గమ్యానికి చేరుకునేంత వరకూ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశాకార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్ కు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేయాలని, అవసరమైతే ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని, అలా చేస్తేనే వైరస్తో సమర్థంగా పోరాడగలమని సీఎం అధికారులతో చెప్పారు.
Recommended Video

విశాఖ బాధితులకు పరిహారం ప్రకటించిన విధంగానే..
ఇక విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపైనా సీఎం జగన్ సమీక్షించారు. కంపెనీలో గ్యాస్ లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను, కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరైన్ గ్యాస్ అవశేషాల తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ముమ్మరంగా శానిటైజేషన్ జరపాలని, అన్ని రకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలన్నారు. ఈరోజు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. మిగిలినవారికి కూడా ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications