చంద్రబాబుపై బీజేపీ 'సంచలన' ఆరోపణనే జగన్ నోట, కేసీఆర్ తవ్వుతున్నా..
అనంతపురం: తాము బతికి ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటు వేయమని అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అధినేత జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభించారు.
ఆయన పలువురు రైతులను, డ్వాక్రా మహిళలను కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్తో మాట్లాడారు. జగన్ ఎదుట వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. కేంద్రానికి సంబంధించి రూ.4,500 కోట్ల నిధులతో రైతులకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందన్నారు.
ఉపాధి పనులు దొరికితే రైతులు స్థానికంగా ఉంటారని, కానీ చంద్రబాబు కేంద్రం డబ్బులను ఇష్టం వచ్చినట్లుగా మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జగన్ అవే వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోయారన్నారు. తాను సీఎం అయితే బేషరతుగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, కానీ ఎవరికీ కాలేదన్నారు. ఇప్పుడు రైతులు వడ్డీ కడుతున్నారని విమర్శించారు.
పంట బీమా రావడం లేదని, ఇన్ పుట్ సబ్సిడీ అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. చివరకు నీళ్లు వస్తాయని చూస్తే చంద్రబాబు పుణ్యాన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎడాపెడా ప్రాజెక్టులు కటడ్టి పంపులు పెట్టి నీళ్లు తవ్వుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ను అడిగే నాథుడు లేడన్నారు.
ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న చంద్రబాబు పాపం పండే రోజు త్వరలోనే రానుందని జగన్ అన్నారు. ప్రజలు ఎన్నుకొన్న నేతలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తున్నాడని, ఆ పాపానికి శిక్షను అనుభవించే రోజు త్వరలోనే వస్తుందన్నారు.