టెక్కీ కూతురుకు పేరుపెట్టిన జగన్, కొనేందుకు బాబు బాగా బిజీగా ఉన్నారని సెటైర్
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఆయన పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఆయన ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు సమస్యలు చెప్పుకున్నారు.
నా వల్లే హైదరాబాద్కు మెట్రో, హెచ్ఐసీసీ టిడిపి వల్లే, నేను కొట్లాడా: చంద్రబాబు
దీనిపై జగన్ మాట్లాడుతూ... వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నాటి చదువుల విప్లవాన్ని మళ్లీ తీసుకు వస్తానని చెప్పారు. కాలేజీల్లో ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఫించను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతామని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
సాఫ్టువేర్ మహిళ కుమార్తెకు పేరు పెట్టిన జగన్
కాగా, జగన్ పాదయాత్రలో ఆయనను మిథిలా రెడ్డి అనే మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కలిశారు. తమ కుమార్తెకు పేరు పెట్టమని అడిగారు. ఆ పాపకు జగన్ రేయాన్ష అని నామకరణం చేశారు. ఆమెను ఒళ్లోకి తీసుకొని ముద్దాడారు. కాగా, తన పాదయాత్రలో జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారు.
చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారని, మరోవైపు రైతులు సాయం అందక బలవుతున్నారని జగన్ మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల హెక్టార్లలో పంట నష్టం తలెత్తినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
మేం అధికారంలోకి వస్తే
వైసీపీ అధికారంలోకి వస్తే పగటిపూట రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును ఇస్తామని జగన్ చెబుతున్నారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగానే అందిస్తామన్నారు. ఏటా మే నెలలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి ఐదేళ్లపాటు కొనసాగిస్తామన్నారు.
రైతులను ఆదుకుంటం
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు రైతులకు ప్రత్యేకంగా రూ.2వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. అవసరమైతే కేంద్రం నుంచి మరో రూ.2వేల కోట్లు జతచేసి నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టును కచ్చితంగా పూర్తిచేస్తామని జగన్ చెప్పారు. కాగా, జగన్ పాదయాత్ర బుధవారం 300 కిలోమీటర్ల మార్క్ చేరుకుంది.