రాయలసీమ పాలనా రాజధాని కోరుకోవడం లేదు-హైకోర్టు చాలు-మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు సాగుతున్న నేపథ్యంలో అధికార వైసీపీకీ, విపక్ష పార్టీలకు మధ్య మాటలయుద్దం ముదురుతోంది. అదే సమయంలో వైసీపీలోనూ అంతర్గతంగా మూడు రాజధానుల విషయంలో ఎక్కడో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో చట్టసభల రాజధాని, కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే అని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ అంశంలో ఓ కొత్త విషయం చెప్పారు. రాయలసీమ పాలనా రాజధాని కోరుకోవడం లేదని, హైకోర్టు సరిపోతుందని పెద్దిరెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. గతంలో సీఎంలంతా హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని కూడా పెద్దిరెడ్డి తెలిపారు.
మరోవైపు విశాఖ రాజధాని ఇష్టం లేకనే కొన్ని పత్రికలు అక్కడ ల్యాండ్ స్కాం అంటూ వార్తలు రాస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. విశాఖలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపైనా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. రాజకీయంగా నడవలేని వ్యక్తిని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రిషికొండ దగ్గరకు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్లు అవుతుందా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉంటే లక్షల కోట్లు సంపాదించాలనేది వారి ఆలోచన అన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర ను మధ్యలో ఎందుకు నిలిపివేశారని మంత్రి ప్రశ్నించారు.