'సీఎం పదవిపై జగన్ పగటి కలలు, చుట్టూ 11 కేసులు', 'నితీష్ను చూసి బాబు నేర్చుకోవాలి'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కంటున్నారని, ఆయన కోరిక నెరవేరదని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప బుధవారం అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలను లక్ష్యంగా చేసుకున్న సైకో విషయమై మాట్లాడుతూ... ఒకటి రెండు రోజుల్లో సైకోను పట్టుకుంటామని చెప్పారు. సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
11 కేసులు తరుముతున్నాయి: దేవినేని
వైయస్ జగన్ను పదకొండు కేసులు తరుముతున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఈ కేసుల విషయంలో ఏం చేయాలో తెలియక, అర్థం కాని స్థితిలో జనాలను గందరగోళపరిచేందుకు జగన్ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఏమాత్రం అవగాహన లేకుడా మాట్లాడుతున్నారన్నారు. అవినీతిపరుడు కాబట్టే జగన్ను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారన్నారు.
ఆ ముగ్గురిపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాం: రఘువీరా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో కేసులు పెడతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం తెలిపారు.
ప్రత్యేక హోదా అంటూ రాష్ట్రాన్ని మోసం చేశారనీ, ఇప్పుడు ప్యాకేజీల పేరుతో మరోసారి వంచించాలని చూస్తున్నారన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు.