జగన్ పాదయాత్ర ఆ దారిలోనే...ఎట్టకేలకు రూట్ క్లియర్
Recommended Video
తూర్పుగోదావరి:జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించే సందర్భంగా ముఖ ద్వారం వంటి రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై ఆయన పాదయాత్రకు నో చెప్పిన పోలీసులు ఎట్టకేలకు తమ పట్టు సడలించారు. అదే బ్రిడ్జి గుండా జగన్ పాదయాత్రకు ఒకే అనేశారు.
జగన్ ఆ రూట్ కాకుండా మరో దారి చూసుకోవాలంటూ వైసిపి నేతలకు నోటీసులు కూడా ఇచ్చిన పోలీసులు తమ నిర్ణయం మార్చుకొన్నారు. పోలీసుల నోటీసులపై స్పందించిన వైసిపి నేతలు తార్కికమైన సమాధానంతో పోలీసులకు ధీటుగా జవాబివ్వడంతో చివరకు పోలీసులు దిగిరాక తప్పలేదు. అలాగే కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో జగన్ బహిరంగ సభకు కూడా తొలుత నో చెప్పిన పోలీసులు చివరకు దానికి కూడా ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి.
ముందు నో...నో: తరువాత ఓకే...ఓకే
తూర్పుగోదావరి జిల్లా లోకి...రాజమహేంద్రవరంలోకి ప్రవేశించాలంటే నగరం ఆరంభంలో ఉన్న చారిత్రాత్మక వారధి మీదుగా వెళ్లే దారే ప్రధాన మార్గం. అయితే ఆ వంతెన పాద యాత్ర సందర్భంగా తరలివచ్చే జన శ్రేణులను తట్టుకోలేదని, మరో దారి చూసుకోవాలంటూ తూర్పు గోదావరి అర్బన్ జిల్లా పోలీసులు రాజమండ్రి వైసిపి కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాష్ రావు కి పోలీసులు నోటిసులు ఇచ్చారు. జగన్ పాదయాత్రకు ఆ మార్గమే అనువైనదిగా భావించిన వైసిపి నేతలు పోలీసుల నోటీసులకు ధీటుగా స్పందించారు.
లాజికల్ ఆన్సర్స్...పోలీసులు ఓకే
పోలీసులు ఏ సందేహాలైతే లేవనెత్తారో వాటికి వైసిపి నేతలు లాజికల్ గా జవాబులిచ్చారు. నిత్యం ఈ వారధి మీదుగా హౌరా - చెన్నై నడుమ 75 ఎక్స్ ప్రెస్ రైళ్లు... అలాగే సుమారు 60 నుంచి 70 వరకు గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తున్న బ్రిడ్జి తమ పాదయాత్రకు ఏ విధంగా అనుకూలం కాదో మీరే సమాధానం చెప్పాలని పోలీస్ వర్గాలను వైసిపి నేతలు ప్రశ్నించారు. వైసిపి నేతలు అడిగిన పాయింట్ లాజికల్ గానే ఉండటంతో దీనిపై కన్విన్స్ అయిన పోలీసులు జగన్ పాదయాత్ర కు అదే దారిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో బహిరంగ సభకు కూడా పోలీసులు ముందు నో చెప్పగా ధానిపై కూడా వైసిపి నేతలు పోలీసుల అనుమానాలకు తగు సమాధానాలు ఇవ్వడంతో అక్కడ జగన్ సభకు కూడా పోలీసులు ఒకే అనేశారు.
కాదంటే...ఆందోళన
టిడిపి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఈ విధంగా జగన్ పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నారని వైసిపి నేతలు బలంగా విశ్వసించాయి. అందుకే ముందుగా పోలీసుల నోటీసులకు తగు సమాధానం ఇవ్వాలని...అయినప్పటికీ పోలీసులు దిగి రాకపోతే ఆందోళనకు సిద్దమవ్వాలని వైసిపి శ్రేణులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్ పాదయాత్రకు వంతెన మార్గంలో పోలీసులు నో చెప్పడంపై విమర్శలు రావడం కూడా పోలీసులు వెనక్కి తగ్గేలా చేసిందని సమాచారం.
ఘన స్వాగతం...సెంటిమెంట్
జగన్ పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు సడలించారని తెలిసి వైసిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. తమ అభిమాన నేత రాకకు ఏ అవాంతరం ఏర్పుడుతుందో అని టెన్షన్ పడిన వైసిపి శ్రేణులు ఇక జగన్ అదే రూట్ లో రానున్నాడని తెలిసి ఉత్సాహంగా స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జగన్ ఈ నెల 12 న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని ఈ దారి గుండా పాదయాత్ర ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెడతారు. 2003 లో కూడా ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అందువల్లే ఈ రూట్ ను వైసిపి శ్రేణులు సెంటిమెంట్ గా ఫీలవుతున్నాయి. పోలీసుల నుంచి తలెత్తిన అభ్యంతరం సమసిపోయి జగన్ పాదయాత్రకు రూట్ క్లియర్ కావడంతో తమ సెంటిమెంట్ కూడా నెరవేరుతుందని వైసిపి శ్రేణులు సంబరపడుతున్నాయి.