సుప్రీంకోర్టులో రోజుకో ట్విస్టు-జగన్ సర్కార్ వ్యూహాలపై తీవ్ర ప్రభావం ! ఎందుకో తెలుసా ?
ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారబోతున్నాయి. అయితే ఈ మార్పులకు కారణం ప్రభుత్వ పాలన, లేదా దానిపై ఉన్న అనుకూలత, వ్యతిరేకతలు మాత్రం కాదు. అంతకు మించి చర్చనీయాంశంగా మారిన రాజధానుల వ్యవహారమే. ముఖ్యంగా అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో అక్కడ చోటు చేసుకుంటున్న ట్విస్టులు మొత్తం వ్యవహారాన్నే మలుపుతిప్పేలా కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టులో ట్విస్టులు
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వం దీనిపై వెంటనే విచారణ పూర్తి చేయాలని కోరుతోంది. అయితే సుప్రీంకోర్టు ఈ పాయింట్ నే పట్టుకుని మార్చిలో హైకోర్టు తీర్పిస్తే సెప్టెంబర్ లో ఎందుకొచ్చారంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో విచారణ అత్యవసరంగా చేపట్టేందుకు నిరాకరిస్తున్న సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసింది. అంతే కాదు ఓసారి గతంలో జరిగిన ఏపీ విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో అమరావతి వాజ్యాల్ని కలిపి విచారిస్తామని, మరోసారి విడివిడిగానే విచారిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇలా రోజుకో రకంగా ట్విస్టులు ఎదురవుతున్న అమరావతి పిటిషన్ల విచారణ ఎప్పటికి తేలుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది.
విచారణ మరింత ఆలస్యం ?
అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జస్ట్ మొదలైందంటే మొదలైంది అంతే. అంతకు మించి ఏమీ జరగలేదు. అసలే హైకోర్టు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ తెచ్చిన మూడు రాజధానులపై విచారణ పూర్తి చేసేందుకే దాదాపు రెండున్నరేళ్లు తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ విచారణకు అంతే సమయం పడుతుందనే అంచనాలున్నాయి. అదీ మధ్యలో కొత్త ట్విస్టులు చోటు చేసుకోకుండా ఉంటేనే. ఇలాంటిపరిస్దితుల్లో వైసీపీ ప్రభుత్వం కోరినట్లు అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఇప్పటికే నో చెప్పేసింది. దీంతో విచారణ వచ్చే ఏడాదిలో తేలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
జగన్ సర్కార్ వ్యూహాలపై ప్రభావం ?
సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ ఆలస్యమవుతున్న కొద్దీ మూడు రాజధానుల ఏర్పాటు కోసం లేదా కనీసం సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతకంతకూ ఆలస్యం కాక తప్పడం లేదు. అలాగని ప్రభుత్వం చట్టాల్ని అసెంబ్లీలో సవరించి రాజధాని తరలించే అవకాశాలు కూడా లేవు. దీంతో సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకూ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చువాల్సిందే. అంతిమంగా రాజధాని తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైన కొద్దీ వాటిని నమ్ముకున్న ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కూడా సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే మూడు రాజధానుల్ని సజీవంగా ఉంచేందుకు జగన్ మరోసారి కేంద్రం సాయం కోరతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.