మరో బాంబు: రాజధాని డాక్యుమెంట్లు ఎలా వచ్చాయని ఆగ్రహం?
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, ఇతర టిడిపి నేతలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని పేర్కొన్న సాక్షి మీడియా బుధవారం నాడు మరో బాంబు పేల్చింది.
భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయని చంద్రబాబు సహచరుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసిందని పేర్కొంది. ఏపీలో కొత్త రాజధాని అమరావతిలో టిడిపి నేతలు నారా లోకేష్, సుజనా చౌదరి, మురళీ మోహన్, పి నారాయణ తదితరులు భూములు కొన్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భూముల డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయని చంద్రబాబు సహచరుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారని తాజాగా పేర్కొంది. కాగా, దీనిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇప్పటికే స్పందించారు. తనకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి భూములు లేవని చెప్పారు.
అంతకుముందు వైసిపి నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణలు టిడిపి నేతల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతిలో లక్ష కోట్ల భూకుంభకోణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరలేపారని ఆరోపించారు.
అమరావతి సమీప గ్రామాల్లో జరుగుతున్న భూకుంభకోణాన్ని వైసిపి మొదటి నుంచి చెబుతూనే ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ఏపీ అంతా అవినీతిమయం చేసిన ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.