సమైక్యం: సభాస్థలికి చేరుకున్న వైయస్ జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సమైక్య శంఖారావం సభ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. సభా సమయానికే స్టేడియం నిండిపోయింది. దీంతో స్టేడియం గేట్లు మూసేశారు. వైయస్ జగన్ సభా స్థలికి చేరుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకున్నారు. జగన్ సభాస్థలికి రావడానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడారు.
సమైక్య శంఖారావం సభ ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కుతోనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని ఆయన అన్నారు.
తెలుగుతల్లిని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా నిలువునా చీల్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. కాంగ్రెసు నాయకులు రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని చీల్చకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం చీలితే ముఖ్యమంత్రి ఎవరు, పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే ఆలోచనలోనే వారున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి మూడు ప్రాంతాలవాళ్లం సేవ చేశామని ఆయన అన్నారు.
ఎల్బీ స్టేడియానికి వచ్చే రహదారాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా జగన్ ఒక్కడికే ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అన్నారు.