నేను భయపడ్డానా.. మోడీని నిలదీయ్, బాబు మనిషేనా: జగన్, విభజనపై..
చిత్తూరు: విభజన వద్దని తాను నాడు పోరాటం చేశానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో జరిగిన యువభేరీ సదస్సులో మంగళవారం నాడు జగన్ మాట్లాడారు.
చంద్రబాబు కేసుల గురించి ఆలోచిస్తున్నారని, అందుకే బిజెపి పైన ప్రత్యేక హోదా విషయమై ఒత్తిడి తేవడం లేదన్నారు. తన పైన కూడా ఎన్నో కేసులు పెట్టారన్నారు. వైయస్ బతికున్నంత వరకు జగన్ మంచోడని, ఎప్పుడైతో ఆ పార్టీని వీడానో అప్పుడు తన పైన కేసులు పెట్టారన్నారు.
చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రతో కేసులు పెట్టాయని ఆరోపించారు. అయినప్పటికీ తాను సోనియా గాంధీ పైన పోరాటం చేశానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు కూడా హోదా విషయంలో కేసుల గురించి భయపడవద్దని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
హోదా కంటే ప్యాకేజీ ముద్దంటున్నారు
ఇప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు చెబుతున్నారని, ఇది సరికాదన్నారు. హోదా మన హక్కు అన్నారు. ప్యాకేజీ కోసం హోదాను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. హోదా కోసం ఎన్నో అబద్దాలు ఆడుతున్నారని, తమిళనాడు అడుగుతుంది, మహారాష్ట్ర అడుగుతుందని చెబుతున్నారన్నారు.
మరి, హోదా కోసం హామీ ఇచ్చిన రోజు ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చే దానిని చంద్రబాబు నాశనం చేస్తున్నాడని, అసలు చంద్రబాబు మనిషేనా అన్నారు. చంద్రబాబు తెలియక చేస్తున్నాడో, తెలిసి చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆడపిల్ల అంటే లక్ష్మి అని చెప్పాల్సింది పోయి అలా వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు.
ఉత్తరాఖండ్ వెళ్లి చూస్తే..
ప్రత్యేక హోదాతో ఏపీకి ఎన్నో లాభాలుంటాయన్నారు. ఉత్తరాఖండ్ వెళ్లి చూస్తే అధి తెలుస్తుందన్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. ఏపీకి హోదా వస్తే మనకూ దొరుకుతాయన్నారు. హోదా మన హక్కు అని విద్యార్థులు నలుగురికి చెప్పాలన్నారు.
కరపత్రం చదవండి...
వైసిపి రెండు పేజుల ఓ కరపత్రం ప్రచురించిందని, దీనిని విద్యార్థులు చదివి హోదా వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ఏ రోజైతే మోడీకి అల్టిమేటం జారీ చేస్తాడో.. ఆ రోజే హోదా వస్తుందన్నారు. నెల రోజుల్లో హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి ఉపసంహరించుకుంటామని చంద్రబాబు అల్టిమేటం జారీ చేయాలన్నారు. అప్పుడో బిజెపి తగ్గుతుందన్నారు. ఐదు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టొద్దన్నారు.
చంద్రబాబు సామెత
ప్రత్యేక హోదా, ప్యాకేజీలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చెప్పిన సామెతను మరోసారి జగన్ గుర్తు చేశారు. ఆడబిడ్డలకు తోడుగా మేమున్నామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి.. వారిని కించపరుస్తూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అని సామెతలు చెబుతున్నాడన్నారు.
హోదా కన్నా ప్యాకేజీ ఏ మేరకు గొప్పదన్న విషయాన్ని చెప్పాలన్నారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులను రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదే ఆర్థిక సంఘం ముఖ్య విధి అని, హోదా ఇవ్వాలా, వద్దా, అన్నది ప్రధాని, క్యాబినెట్ కు మాత్రమే సంబంధించిన విషయమన్నారు. ప్రధాని చేతుల్లోనే ఎన్డీసీకి అధిపతిని, నీతి అయోగ్కూ ఆయన హెడ్గా ఉన్నారన్నారు.
ఆయనపై ఒత్తిడి వస్తే హోదా వస్తుందన్నారు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, అవన్నీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలేనని, అవన్నీ తెలిసి కూడా చంద్రబాబు కావాలనే మభ్య పెడుతున్నారన్నారు.
ఈ సామెతల చంద్రబాబు ఏమైనా చెబుతాడని, వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. హోదా వచ్చి అన్ని రాయితీలూ వస్తేనే పారిశ్రామికవేత్తలు ఆకర్షితులై రాష్ట్రానికి వస్తారని, అప్పుడు మాత్రమే యువతకు లక్షల్లో ఉద్యోగాలు దగ్గరవుతాయన్నారు. ఆ విషయం తెలిసి కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ఆడుకుంటున్నారన్నారు. హోదా కోసం 26న దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.