స్వాతంత్ర్యం కూడా సంజీవినా అనేవారు: హోదాపై బాబును నిలదీసిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవినా అని చంద్రబాబు అనడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ స్వాతంత్ర్యం సంజివీనా అని అని ఉండేవారని అన్నారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి అన్యాయంగా, దుర్మార్గంగా ఉందని, ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్యాకెజీ కోసమే వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి చర్చలు జరిపినట్లు అర్థమవుతోందని అన్నారు. బంద్ను విఫలం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబురు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
చంద్రబాబుతో మాట్లాడానని, ప్యాకేజీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పగానే రాజ్యసభలో టిడిపి సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయాలు, మోసాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర విభజన సందర్బంగా ఇచ్చిన హామీలను వదిలేస్తున్నప్పుడు వారు మనుషులేనా అని అనిపిస్తోందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా వస్తే విపరీతంగా పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా దాన్ని కాలరాస్తున్నారని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నామని, ప్రత్యేక హోదా మన హక్కు అని చాటుతున్నామని ఆయన అన్నారు. తమ పోరాటాల వల్లనే చంద్రబాబు కూడా మరిచిపోలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఫలితం వచ్చే వరకు పోరాటం చేస్తాని ఆయన చెప్పారు. ఎల్లుండి నెల్లూరులో యువభేరీ కార్యక్రమం పెట్టామని చెప్పారు. ప్రత్యేక హోదాపై విన్నవించేందుకు తమకు సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని, ప్రధానిని కోరామని ఆయన చెప్పారు.