కాంగ్రెస్కు జగన్ కొత్తర్థం: తెలంగాణలో ఉండటంపై డౌట్స్
న్యూఢిల్లీ: సోనియా నేతృత్వంలోని కాంగ్రెసు(ఐఎన్సి) పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కొత్త అర్థం ఇచ్చారు. ఐఎన్సి అంటే భారత దేశపు కాంగ్రెసు పార్టీ కాదని అది ఇటాలియన్ నేషనల్ కాంగ్రెసు అని దుయ్యబట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఆ తర్వాత పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన సమయంలో పోలీసులు అరెస్టు చేసి విడుదల చేసిన అనంతరం జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉద్యోగాలు, సీమాంధ్ర ప్రాంత ప్రజలకు భద్రత పైన అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి కొన్ని ఉదాహరణలు చూపించారు. విభజన తర్వాత సీమాంధ్రలో ఉండవచ్చునని, వారికి ఎలాంటి ఢోకా ఉండదని తెలంగాణ ప్రాంత నేతలు, కేంద్రం చెబుతున్న విషయం తెలిసిందే.
దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్, కర్నాటకలో కన్నడిగుల పార్టీ, తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఎందుకున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. వారి వారి రాష్ట్రల వారికి న్యాయం కోసం, ఉద్యోగాల కోసం ఆ పార్టీలు పుట్టుకు వచ్చాయని చెప్పారు.
అలాగే రేపు తెలంగాణ వచ్చాక అక్కడి వారు సీమాంధ్ర ప్రజలను హైదరాబాదు నుండి వెళ్లిపోవాలంటే ఎక్కడకు వెళ్లిపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకునేందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎపి రిజిస్ట్రేషన్ కారులో చెన్నై, ఇతర రాష్ట్రాలకు వెళ్తే తెలుస్తుందన్నారు.