అసెంబ్లీలో వైయస్ జగన్ నోట ఇన్సైడ్ ట్రేడింగ్: అంటే ఏమిటి?
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధానిలో జరిగిన భూ అక్రమాల విషయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం దద్దరిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
బుధవారం సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత ఇన్సైడ్ ట్రేడింగ్ అనే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. రాజధాని భూముల విషయంలో ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పండిందంటూ వైయస్ జగన్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎంటో తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ అన్యాయం దొరా.... చంద్రబాబును చూస్తే నవ్వేస్తోందని, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అని అన్నారు. ముందు దాని గురించి తెలుసుకోవాలన్నారు. రైతుల భూములు తీసుకోవడం చాలా అన్యాయమైన విషయం దొరా అన్నారు.
వైయస్ జగన్ చెప్పిన ఇన్సైడ్ ట్రేడింగ్కు అర్ధం ఏమిటంటే తమకు అనుకూలంగా ఉన్నవారికి లభ్ది చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరించడమే. కాగా రాజధాని భూముల విషయానికి వస్తే... "చంద్రబాబుకు ఇన్సైడ్ ట్రేడింగ్కూ, ఇన్సైడర్ ట్రేడింగ్ కూ తేడా తెలీడం లేదు. ఆయన చేసింది ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఆరోపిస్తున్నాం. అధ్యక్షా... అక్కడ సమస్యేంటంటే, మీ బినామీలందరూ అక్కడ భూములు కొనుగోలు చేసి, సెటిలైన తరువాత, వారి భూములు అక్విజేషన్ లేదా పూలింగ్ నుంచి తప్పించి, వారి పక్కన ఉన్న భూములను పూలింగ్ లేదా అక్విజిషన్లో తీసుకోవడమే".
అంతక ముందు రాజధాని భూముల కొనుగోలు విషయంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు బాధపడుతున్నారు... భూముల విషయంలో ఆరోపణలు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని రైతులు అడుగుతున్నారన్నారు. రాష్ట్రం ఏమైనా కానీయండి.. నేను రాజకీయం చేస్తానని అంటే ఎలా అని ప్రశ్నించారు.
మీరంతా రాష్ట్రంలో భాగస్వాములు అని.. అలాంటప్పుడు రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగిందన్నారు. రైతులను వైసిపి భయాందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత నన్ను అన్నాడంటే వదిలేస్తామని, కానీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
అసలు మీ నాయకుడికి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే తెలుసా? అని వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే తెలుసా అన్నారు. రాజధాని రాకుండా తగులబెట్టాలనుకున్నారన్నారు. కుట్రకు పాల్పడుతున్నారన్నారు. కుట్ర చేస్తున్నందున సిబిఐ విచారణ కాదు.. ఏ విచారణ వేయమని ఆవేశంతో మాట్లాడారు.