'ఒకేరోజు అనంతపురంలో రాహుల్-జగన్ టూర్ వెనుక, సీక్రెట్ భేటీ'
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో రహస్యంగా కలిశారా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు.
రాహుల్, జగన్లు కలిసింది నిజం కాదా చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలు స్పష్టం చేయాలన్నారు. రాహుల్ గాంధీ వచ్చిన సమయంలోనే జగన్ అనంతపురం జిల్లాలో యాత్రలు చేయడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. వీరిద్దరు రహస్యంగా కలిసి మంతనాలు జరిపారన్నారు.
ఇరువురు నేతలు కూడబలుక్కొని అనంతపురంలో పర్యటించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉందని చెప్పారు. దీనిపై పోరాట కార్యక్రమానికి టిడిపి మార్గాలను అన్వేషిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో మాట్లాడకుండా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్, జగన్ మాట్లాడుకొనే ఒకేరోజు జిల్లాలో పర్యటించారని, రహస్య ఒప్పందముందన్నారు.