మంత్రులపై జగన్ సీరియస్-ముగ్గురికి వార్నింగ్-పద్ధతి మార్చుకోండి-ఎవర్నీ వదలొద్దు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. అంటే దాదాపు సగం పదవీకాలం పూర్తయిపోయింది. ఇంకా కేబినెట్ మంత్రుల్లో చాలా మంది కుదురుకోనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు వీరిలో చాలా మంది త్వరలో ఇంటిముఖం పట్టబోతున్నారు కూడా. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన అంశాలతో పాటు విపక్షాల విమర్శలపైనా మంత్రులు సరిగ్గా స్పందించడం లేదని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీంతో పాటు మంత్రులకు కీలక సూచనలు చేశారు.
రెండేళ్లు దాటిన వైసీపీ పాలన
ఏపీలో వైసీపీ పాలన ఈ మధ్యనే రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ డిసెంబర్ లో రెండున్నరేళ్లు పూర్తవుతాయి. అంటే సగం పదవీకాలం పూర్తయినట్లే. ఈ కాలంలో వైసీపీ పాలన ప్రజల్ని మెప్పించిందా ? మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని గతంలో చెప్పిన జగన్ ఎంత వరకు తన లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు ? ప్రజలిచ్చిన అధికారాన్ని వారి బాగు కోసమే వాడుతున్నారా ? ఇలా సవాలక్ష ప్రశ్నలు ప్రజల మెదళ్లలో ఉన్నాయి. వీటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనకు మాత్రం ఈ అంశాలు ప్రామాణికంగా మారబోతున్నాయి.
త్వరలో కేబినెట్ ప్రక్షాళన
గతంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 80 శాతం మంది మంత్రులు డిసెంబర్ లో తప్పుకోవాల్సి ఉంటుంది. వారి స్ధానంలో కొత్త మంత్రులు వచ్చి చేరతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు సాగుతోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ వద్ద రోజువారీ నివేదికలు వచ్చి చేరుతున్నాయి. ఇంటిలిజెన్స్ వర్గాలతో పాటు తన సొంత టీమ్ ద్వారా జగన్ తన మంత్రుల పనితీరును అంచనా వేస్తున్నారు. వీటి ఆధారంగానే త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళన నిర్ణయం కానుంది. దీంతో ఈ క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి.
టీడీపీ, బీజేపీ అటాక్ తో ఉక్కిరిబిక్కిరి
వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విపక్ష టీడీపీ, బీజేపీ నుంచి భారీ ఎత్తున అటాక్ ప్రారంభమైంది. ముఖ్యంగా జగన్ సర్కార్ అప్పుల కష్టాలతో పాటు మతపరమైన బలహీనతల్ని వాడుకుంటూ టీడీపీ, బీజేపీ చెలరేగిపోతున్నాయి. దీంతో మంత్రులు వాటికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. అనవసరంగా వారిని కెలికితే తమకే నష్టం చేస్తుందన్న భావనలో ఉన్న మంత్రులు మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కూడా వీరిపై అసహనంగా ఉంటున్నారు.
మంత్రుల పనితీరుపై జగన్ సీరియస్
ఏపీలో వైసీపీ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం జగన్ తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో వాటి ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విపక్షాలు ప్రభుత్వాన్ని ఆటాడుకుంటుంటే మంత్రులు మాత్రం మౌనం వహించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల మౌనంపై జగన్ వారికి చురకలు అంటించారు. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారిని ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ముగ్గురు మంత్రులపై ఆగ్రహం ?
తన కేబినెట్లోని ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిపై జగన్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి కేబినెట్ భేటీలో వారికి నేరుగానే సీఎం జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారిని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని సీఎం నిలదీసినట్లు సమాచారం. సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిపోతే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, దాని మంత్రులు ఎందుకు కౌంటర్ వ్యాఖ్యలు చేయడం లేదని, ఇలా అయితే టీడీపీ నేతల తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తాయని, కౌంటర్గా మంత్రులు ఎందుకు స్పందించలేకపోతున్నారని సీఎం మంత్రులను నిలదీశారని చెబుతున్నారు.
పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్
ప్రభుత్వాన్ని తాజాగా టీడీపీతో పాటు బీజేపీ కూడా విపరీతంగా టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా సున్నితమైన, మతపరమైన అంశాల్ని లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహంపై బీజేపీ చేసిన రాజకీయంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ టార్గెట్ చేసినప్పుడూ వైసీపీ మంత్రులు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో జగన్ ఆయా అంశాల్ని ప్రస్తావిస్తూ పద్దతి మార్చుకోవాలని మంత్రులకు సూచించారు. ఇకపై ప్రతీ అంశాన్నీ పరిశీలిస్తానని మంత్రులతో జగన్ అన్నట్లు తెలుస్తోంది.
పని మొదలుపెట్టేసిన మంత్రులు
నిన్న మధ్యాహ్నం కేబినెట్ భేటీలో మంత్రుల మౌనంగా సీఎం జగన్ ఇలా క్లాస్ పీకారో లేదో అలా మంత్రులు తమ పని మొదలుపెట్టేశారు. కేబినెట్ భేటీ ముగియగానే బ్రీఫింగ్ చేసిన సమాచారమంత్రి పేర్ని నాని.. బీజేపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కార్ అప్పులపై ప్రశ్నిస్తున్న బీజేపీని టార్గెట్ చేస్తూ ఎన్డీయే సర్కార్ అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. జగన్ ను దించేసి ఏపీలో అధికారంలోకి రావాలని బీజేపీకి ఆత్రం పెరిగిపోతోందంటూ సెటైర్లు వేశారు. ఏ బాబానో సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ తొందర పడుతోందంటూ పేర్నినాని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో జగన్ ఇచ్చిన టానిక్ పనిచేయడం మొదలైందా అన్న చర్చ జరుగుతోంది.