రుయా, విజయవాడ జీజీహెచ్ ఘటనలపై జగన్ సీరియస్-కీలక ఆదేశాలు
తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా ధాటికి తట్టుకోలేక చనిపోయిన కుమారుడిని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లినఘటన, విజయవాడలో అదృశ్యమైన మానసిక వికలాంగురాలిపై జీజీహెచ్ లోనే 30 గంటల పాటు గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలు కలకలం రేపాయి. వీటిపై సీఎం జగన్ ఇవాళ వైద్యారోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ అధికారుల్ని హెచ్చరించారు.
రుయా, విజయవాడ జీజీహెచ్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ అధికారులు, మంత్రులకు కీలక సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఫిర్యాదు చేసే నంబర్లు కనిపించేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యమిత్రల కియోస్క్ల వద్ద కూడా ఈ నంబర్లు స్పష్టంగా డిస్ప్లే చేయాలన్నారు. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి వాహనాలమీద కూడా ఫిర్యాదు నంబర్లు కనిపించాలన్నారు.

రాష్ట్రంలో చోటు చేసుకునే ఇలాంటి ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్ధకే చెడ్డపేరు వస్తుందని జగన్ అధికారులతో అన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పోలీసులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఇప్పటికే విజయవాడ జీజీహెచ్ ఘటనలో అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారని కూడా గుర్తుచేశారు.
ప్రభుత్వం అంటే మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టంగా ఉండాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా మరింత గట్టిగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవేనని అధికారులకు గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications