బాబును చూస్తే జాలేస్తోంది, ఎందుకంటే?: జగన్, ‘నంద్యాల మరో పులివెందులే’
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. క్రాంతినగర్, చాపిరేవులలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి అనేది ఏపీలో లైసెన్స్లా మారిందని ఆరోపించారు.

బాబు, లోకేష్ ఇప్పుడే ఎందుకు?
తమకు ప్రత్యేక అవసరం ఏమీ లేనప్పటికీ గ్రామ ప్రజలందరూ ఒక నదిలా ఇక్కడకు వచ్చి అప్యాయతను చూపిస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర కేబినెట్ మొత్తం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తోందని, టీడీపీ అధికారంలో ఉన్న ఈ మూడున్నరేళ్లలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇలా మంత్రులు పర్యటించలేదని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్లు నంద్యాల వైపు చూస్తున్నారని, ఇంతకుముందు ఇటువైపు ఎందుకు చూడలేదో చెప్పాలని వైయస్ జగన్ అన్నారు.

బేరాలు లేదంటే బెదిరింపులు..
గెలుపే లక్ష్యంగా వందల కోట్ల డబ్బును వెదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చిన్నా చితకా నాయకులను కూడా మీ రేటెంతా? అంటూ కొనుగోలు చేయడానికి టీడీపీ బేరసారాలు చేస్తోందని అన్నారు. బేరసారాలకు లొంగనివారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపించారు.

బాబు కుట్రలు ఇలా..
నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్య సామాజిక వర్గ మద్దతు బాగా ఉందని, దీంతో వాళ్లను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ కుట్రలో చేస్తోందని విమర్శించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆర్యవైశ్య కుటుంబం తలుపుతట్టిన పోలీసులు బెదిరింపులకు దిగారని అన్నారు. వారి ఇంట్లో ఉన్న రూ. 3.5లక్షలు ఎక్కడివని ప్రశ్నించారని చెప్పారు. ఆ ఆర్యవైశ్య కుటుంబానికి మెడికల్ షాపు ఉందని, దుకాణం పెట్టుకున్న వారింట్లో డబ్బు ఉంటే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసైనా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

బాబును చూస్తే జాలేస్తోంది..
చంద్రబాబును చూస్తే తనకు జాలేస్తోందని, ఈ దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చిందో ఆయన్ను ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఒక్క హామీ కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో ఆలోచించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క సమాజానికి కూడా బాబు న్యాయం చేయలేదని అన్నారు. అందుకే ఇప్పుడు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడాకూడా అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని జగన్ ఆరోపించారు.

నంద్యాలలో యుద్ధమే..
అన్యాయంగా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని, నిస్సిగ్గుగా వారిని మంత్రులుగా చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, ఎవరైన ప్రశ్నిస్తే.. వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు, మద్యం, పోలీసు బలంతో ఉప ఎన్నికలో గెలువవచ్చునని బాబు అనుకుంటున్నారని అన్నారు. మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా మనం ఓటు వేస్తున్నామని, ఆయన పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నామని ప్రజలు గుర్తుంచుకోవాలని జగన్ అన్నారు. నంద్యాల ప్రజలు వేసే ఓటు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి కాదని.. అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్లు భావించాలని సూచించారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి.. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు.

జగన్ మోసం చేయడు..
జగన్ ఎప్పుడూ మోసం చేయడని, ఏదైనా చెబితే చేస్తాడని చెప్పారు. తన ఆస్తి విలువలతో కూడిన రాజకీయాలు చేయడమేనని జగన్ అన్నారు. తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి ప్రజలేనని వైయస్ జగన్ చెప్పుకొచ్చారు. తన తండ్రిలాగే తాను కూడా పేదల కోసం పరితపిస్తాడని ప్రజలు నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెడతానని జగన్ తెలిపారు.

మరో పులివెందుల చేస్తాం..
చంద్రబాబు పాలనకు నంద్యాల ఉప ఎన్నిక ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వాలని జగన్ ప్రజలను కోరారు. పులివెందులను అభివృద్ధి చేసినట్టే నంద్యాలను అదేస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. చంద్రబాబు ఓటర్లకు ఎరవేస్తున్నారని, బుజ్జగింపులు, బెదిరింపుల ద్వారా ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని కాపాడాలని కోరారు.












Click it and Unblock the Notifications