అసెంబ్లీ: చంద్రబాబు ఎదురుదాడి, క్లైమాక్స్లో దెబ్బతిన్న జగన్ వ్యూహం?
హైదరాబాద్: శాసనసభలో బుధవారం క్లైమాక్స్లో ప్రతిపక్ష నేత జగన్ వ్యూహం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనూహ్యంగా రాజధాని భూముల విషయంలో ఎదురుదాడికి దిగడంతో వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు.
మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులు కొనుగోలు చేసినట్లు చెప్తున్న భూముల వ్యవహారంపై సాక్ష్యాధారాలను చూపాలని, ఆధారాలు చూపితే వారిద్దరిని డిస్మిస్ చేస్తానని సవాల్ విసురుతూ చంద్రబాబు జగన్ మీద పైచేయి సాధించారు. మంత్రులు, టీడీపీ సభ్యులు చంద్రబాబు సవాల్ను గుర్తు చేస్తూ జగన్ను ఇరకాటంలోకి నెట్టారు.
ఈ సమయంలో అయితే బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుని వివాదానికి స్వస్తి చెప్పే మార్గాన్ని సూచించారు. ఈ సందర్భంలో యనమల రామకృష్ణుడు రంగంలోకి అసెంబ్లీలోని రూల్ 329ను ఉపయోగించారు. ఈ రూల్ ప్రకారం రాజధాని భూముల కొనుగోలు చర్చను ముగించాలని సూచించారు.
సభలో చర్చ తప్పుతోవ పట్టడంతో, రూల్ 329 ప్రకారం ముగింపు పలకాల్సిన అవసం ఉందని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిస్తూ శాసనసబా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడంతో వైసీపీ సభ్యులు సీబీఐ విచారణ కోసం నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు.
దీంతో స్పీకర్ వైసీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే జగన్ సస్పెన్షన్ దాకా విషయాన్ని లాగకుండా తమ డిమాండ్ను అంగీకరించనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి ఉంటే వ్యూహం కాస్త ఫలితాన్ని ఇచ్చేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.
కాగా బుధవారం జరిగిన శాసనసభా సమావేశాల్లో అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడికి దిగడానికి ముందు వరకు కూడా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పైచేయి సాధించినట్లు కనిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన సమావేశాల్లో రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారంలోకి రావడానికి ముఖ్యమన రైతు రుణమాఫీ హామీని మాత్రం ఆయన నిలెబట్టుకోలేకపోయారని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సభలో సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎన్నికలకు ముందు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కావస్తున్నా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.84,000 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే మాఫీ చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని జగన్ విమర్శించారు.