ఇప్పుడూ డైవర్షన్ రాజకీయాలేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. వ్యవసాయ రంగం కుప్పకూలిందని, రైతులు అష్టకష్టాలను ఎదుర్కొంటోన్నారని, వీటి నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రైతన్నా.. మీకోసం కార్యక్రమంపై జగన్ విమర్శలు చేశారు. రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, వాటిపై చర్చించకుండా ముసుగు వేసి చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 18 నెలల కాలంలో రైతులకోసం చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడ అండగా నిలిచారని ప్రశ్నించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఆయన ఎండగట్టారు.

రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా చంద్రబాబు రైతులవైపు కన్నెత్తి చూడట్లేదని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా నెలకొన్న పరిస్థితులను తట్టుకోలేక, ఎటువంటి ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకిన చంద్రబాబు ఇప్పుడు వారి ఒంటి మీద చొక్కా కూడా లేకుండా చేశాడని జగన్ మండిపడ్డారు.
డైవర్షన్, పబ్లిసిటీ రాజకీయాలతో రైతులకు ఎండమావులు చూపిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి చంద్రబాబు నియమించుకున్న లాయర్లకు కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోన్నారు గానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రావట్లేదని విమర్శించారు.
వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా చెబుతోన్న చంద్రబాబు.. అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు. ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టట్లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications