జగన్ చెప్పడం వల్లే.. డ్యామేజ్ తప్పింది: సీమ నుంచి గురిపెట్టిన టీడీపీ..
రాయలసీమలో ఆ పార్టీ మైలేజ్ తగ్గించగలిగితే రానున్న రోజుల్లో జగన్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేయవచ్చునన్నది టీడీపీ ప్లాన్.
విజయవాడ: ఊహించినట్లుగానే నంద్యాల ఉపఎన్నిక గెలుపు తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచే పనిలో పడింది టీడీపీ. ఇందుకోసం నేరుగా గాలం వేసే బదులు ముందుగా మైండ్ గేమ్ తో వైసీపీని దెబ్బకొట్టాలని చూస్తోంది.షాకింగ్:
పవన్ కళ్యాణ్ 'డిప్యూటీ సీఎం' డిమాండ్, జగన్ ఓకే? తేల్చేసిన వైసిపి
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్న కృత నిశ్చయంతో టీడీపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం అధినేత ఇప్పటికే కొంతమంది నేతలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆయా జిల్లాల్లో వైసీపీ నేతలకు గాలం వేసే పనులు మొదలయ్యాయి.
టీడీపీ మైండ్ గేమ్:
నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఒకింత ఆత్మన్యూనతలో కూరుకుపోయిన వైసీపీ నేతలకు భవిష్యత్తుపై కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవం. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన టీడీపీ.. నయానో.. భయానో వారందరిని తన గూటికి చేర్చుకునే ప్రయత్నాలు షురూ చేసింది. కర్నూలు నుంచి ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అనే ప్రచారాన్ని కూడా ఇందులో భాగంగానే చూడాల్సి వస్తోంది.
గీత దాటకుండా కట్టడి:
మునుపటితో పోలిస్తే పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ నియంత్రణ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. నంద్యాల ఎన్నికల నాటి నుంచే ఫిరాయింపులు మళ్లీ మొదలవవచ్చు అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలందరిని గీత దాటకుండా కట్టడి చేశాడని, అందుకే తాజా ఫిరాయింపు వార్తలను ఎమ్మెల్యేలు ఖండించారని చెబుతున్నారు.
జగన్ చెప్పడం వల్లే:
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారుతారన్న ప్రచారం గతంలోను చాలానే జరిగింది. లైట్ తీసుకున్నారో.. మరేమో గానీ అప్పట్లో రేణుక దానిపై స్పందించలేదు. కానీ తాజాగా మరోసారి ఆమె పార్టీ ఫిరాయింపుపై జోరుగా చర్చ జరుగుతుండటంతో స్పందించక తప్పలేదు.
తాను వైసీపీలో కొనసాగుతానని, పార్టీ మారేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ స్పందన వెనుక జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చి ఖండించకపోతే.. ఇలాంటి ప్రచారాలు పెద్ద డ్యామేజే చేస్తాయని జగన్ భావించినట్లుగా చెబుతున్నారు.
రాయలసీమపై స్పెషల్ ఫోకస్:
రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టు ఉండటంతో.. ఆపరేషన్ ఆకర్ష్ ఇక్కడి నుంచే మొదలుపెట్టాలనే పనిలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో ఆ పార్టీ మైలేజ్ తగ్గించగలిగితే రానున్న రోజుల్లో జగన్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేయవచ్చునన్నది టీడీపీ ప్లాన్.
టీడీపీ వ్యూహాలను అంచనా వేసిన జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీ మారనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. జగన్ వాళ్లతో మాట్లాడినట్లు సమాచారం.
త్వరలోనే అనంతపురంలో యువభేరీ ఏర్పాటు చేసి అక్కడి పార్టీ నేతలందరికి జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే మిగతా రాయలసీమ జిల్లాలపై కూడా జగన్ ఫోకస్ చేసినట్లు సమాచారం.
నేతలతో టచ్ లో ఉంటూ వారు పార్టీ మారకుండా చూసుకునేలా కీలక నేతలు బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తానికి మునుపటిలా కాకుండా.. జగన్ వెంటనే అప్రమత్తమవడం వల్ల పార్టీకి బిగ్ డ్యామేజ్ తప్పిందంటున్నారు.