2పేజీల మేనిఫెస్టో, 2024లో ప్రజలముందుకు: బాబుపై జగన్ నిప్పులు, షర్మిల ఆప్యాయంగా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. అంతకుముందు వైయస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Recommended Video
ఇడుపులపాయ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. అంతకుముందు వైయస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
జగన్ పాదయాత్ర,15 మంది టీడీపీలోకి జంప్?
ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద ఉదయం జగన్ నివాళులు అర్పించారు. జగన్తో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలలు ఉన్నారు. వారు జగన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొన్నారు. వైయస్ ఘాట్కు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఇడుపులపాయ కిక్కిరిసిపోయింది.
పాదయాత్ర ప్రారంభం సమయంలో జగన్ ఇడుపులపాయలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తొలుత రోజా, కొడాలి నాని, ధర్మాన ప్రసాద రావు తదితర నేతలు మాట్లాడారు. అనంతరం జగన్ ప్రసంగించారు.
రాజకీయాల నుంచి తప్పించేందుకు
అధికారం కోసం చంద్రబాబు నుంచి పలువురు నాయకులు చేసే తీరును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తనను రాజకీయాల నుంచి తప్పించాలని, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వైయస్ చనిపోయిన ఎనిమిళ్లు అయిన తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే బాధగా ఉందన్నారు.
నా వయస్సు సగం కూడా ఉండదేమో
చంద్రబాబు వయస్సులో బహుశా తన వయస్సు సగం కూడా ఉండదేమోనని జగన్ అన్నారు. కానీ ఆయనలోని రాక్షసత్వం చూసినప్పుడు బాధగా ఉందన్నారు. కానీ తనకు అండగా ఉన్న ఇంత పెద్ద కుటుంబాన్ని (ప్రజలను) చూసిన తర్వాత తనకు ఊరట కలుగుతుందని చెప్పారు. మీరు అండగా ఉన్నందుకు థ్యాంక్స అన్నారు.
బాబు వంటి మోసగాడు దేశచరిత్రలో లేరు
చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోందన్నారు. కానీ పరిపాలన ఎలా ఉందని జగన్ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క కుటుంబమైనా సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలు మరిచిపోలేని మంచి పాలన ఇవ్వలేకపోయారన్నారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వీరు చేయని అక్రమాలు లేవన్నారు. ఈయన పాలనలో రైతుల నుంచి మహిళలు, విద్యార్థుల వరకు లాభం లేదన్నారు. చంద్రబాబు వంటి మోసగాడు దేశచరిత్రలో ఉండడని చెప్పారు.
ప్రజల నుంచి మేనిఫెస్టో, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో
తన 3000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని జగన్ చెప్పారు. మేనిఫెస్టోను చంద్రబాబులా ఆఫీస్లో కూర్చొని కాకుండా, ప్రజల నుంచి, ప్రజలు చెబితే తీసుకుంటానని చెప్పారు. చంద్రబాబులా పుస్తకాల కొద్ది మేనిఫెస్టో తీసుకురామని, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఉంటుందన్నారు.
2024లో అలా ప్రజల ముందుకు వెళ్తాం
మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని, తిరిగి 2024లో మేం తిరిగి ప్రజల ముందుకు పోతామని జగన్ చెప్పారు. నాలుగేళ్ల బాబు పాలనలో రాష్ట్రంలోని ఆస్తులు పెరగలేదని, కానీ అప్పులు మాత్రం పెరిగాయన్నారు. చంద్రబాబు పాలన వల్ల కేవలం నాలుగేళ్లలో ఏపీ అప్పు రూ.2 లక్షల ఆరువేల కోట్లకు పెరిగిందన్నారు. అంతకుముందు 96వేల కోట్లు ఉన్నదని చెప్పారు. రైతు రుణమాఫీపై ఓ వైపు పిక్ పాకెట్ చేస్తూ, మరోవైపు రుణమాఫీ చేశానంటూ ఫోజులు కొడతాడని మండిపడ్డారు. అలా చేస్తే ఆ ముఖ్యమంత్రిని దొంగ, మోసగాడు కాక ఏమంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే
చంద్రబాబు ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని రోజా అన్నారు. ఆయన 600 హామీలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. మా అందరిని మోసం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న చంద్రబాబును గద్దె దింపే వరకు జగన్ పాదయాత్ర ఆగదన్నారు. జగనన్న వస్తున్నాడని గట్టిగా చెప్పారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అన్నారు. ఆయన పాలనలో మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబును గద్దెదించాలన్నారు. అందుకు జగనన్నకు అందరూ అండగా ఉండాలన్నారు.