కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
Recommended Video

అమరావతి: కాపు రిజర్వేషన్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కాపు నేతలు, కాపు యువత మండిపడుతున్నారు. మరోవైపు, వైసీపీ జగన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
జగన్ చేసిన వ్యాఖ్యలు కాపులను అసంతృప్తికి గురి చేశాయి. కాపు నాయకులు కొందరు కిర్లంపూడి సమీపంలో ఆదివారం జగన్ను అడ్డుకున్నారు కూడా. దానికి తోడు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ గుర్తించింది. దీంతో ఆ పార్టీ జగన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు తంటాలు పడుతోంది. జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని సోమవారం అంబటి రాంబాబు చెప్పారు.

ప్రచారంతో దెబ్బపడుతుందని గ్రహించిన వైసీపీ
కాపు రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టు, కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తాను ఏం చేయలేనని జగన్ చెప్పారు. అయితే జగన్ కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రచారంతో దెబ్బపడుతుందని గ్రహించిన వైసీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వివరణ ఇస్తోంది. కానీ జగన్ వ్యాఖ్యలు ఓ విధంగా కాపులకు వ్యతిరేకమేనని టీడీపీ, కాపు నేతల వాదనగా ఉంది. రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తానని ఎందుకు చెప్పలేదనేది ప్రశ్న.

ముద్రగడ ప్రశ్నకు సమాధానం లేదా?
తన పరిధిలో లేదని జగన్ చెప్పడంతో.. దానికి మరింత కల్పించి ప్రచారం జరుగుతోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉందా అని అడుగుతున్నారు. మన పరిధిలో లేని ఎన్నో అంశాలపై కేంద్రంపై పోరాడుతున్నప్పుడు ఈ అంశంపై కూడా పోరాడవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.

కాపుల అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం
కాపుల ఆగ్రహం, టీడీపీ నేతల ఎదురుదాడితో వైసీపీ స్పష్టత ఇచ్చింది. తమ పార్టీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, జగన్ ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పడని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని అంబటి రాంబాబు చెప్పారు. అయితే జగన్తో కాపుల అంశంపై చెప్పించాలని ఇతర పార్టీల నేతలు, కాపులు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ వ్యూహాన్ని పసిగట్టిన టీడీపీ
తనకు ఎలాగు కాపుల ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో టీడీపీకి అండగా ఉండే బీసీ ఓట్ల కోసం జగన్ గాలం వేసే వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశారని చాలామంది భావిస్తున్నారు. బీసీల వైపు జగన్ కన్నేయడంతో టీడీపీ కూడా అప్రమత్తమయిందని అంటున్నారు. కాపు రిజర్వేషన్లపై బీసీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో.. కాపు ఓట్లు పవన్ వైపు మొగ్గితే, తన వైపు బీసీలు మొగ్గు చూపుతారని జగన్ భావించారని అంటున్నారు. జగన్ వ్యూహాలను గమనించిన టీడీపీ అందుకు తగిన విధంగా సమాలోచనలు చేస్తున్నారట.












Click it and Unblock the Notifications