చంద్రబాబుకు డబ్బు పిచ్చి, జిత్తులమారి రాజకీయాలు: ఏకేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు డబ్బు పిచ్చిపట్టిందని, రైతులు, ప్రజల సమస్యలకు ఆయన పట్టడం లేదని ఆరోపించారు. రాయలసీమను నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకుంటూ జిత్తులమారి రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
సాగునీటి విడుదల కోసం తహశీల్దారు కార్యాలయం వద్ద వైయస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భారీ ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో తీవ్రమైన నీటి సమస్య ఉందని తెలిపారు. చిత్రావతి, శ్రీశైలంలో నీళ్లు ఉన్నా ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
తుంగభద్ర నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. గండికోట కట్టని కారణంగానే ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అన్నారు. చాలిచాలని కేటాయింపులతో ప్రాజెక్టులను నత్తనడకన నిర్మిస్తున్నారని అన్నారు.

గాలేరునగరి, హంద్రీనీవా పూర్తి చేసుంటే రైతుల నీటి సమస్య తీరేదని అన్నారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానన్న చంద్రబాబు.. మాటలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. నీళ్లు వాడుకునేందుకు జీవో ఎందుకు ఇవ్వలేదని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టులకు భిక్షం వేసినట్లు నిధులు కేటాయిస్తున్నారని, పెండింగ్లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. చిత్రావతికి తుంగభద్ర నుంచి నీళ్లు రావాలని అన్నారు. చంద్రబాబు.. రైతుల భూములను లాక్కుని పెద్దలకు పంచాలని చూస్తున్నారని అన్నారు.
రైతులకు రుణాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధి రావాలని ఎండలోనే ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్ర ఎక్కువగా ఉన్నప్పటికీ భారీ ఎత్తున ధర్నాలో పాల్గొన్న ప్రజలకు ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications