వైసీపీ ఆ సూత్రాన్ని పాటిస్తోంది: లోకేష్, గుడిలో లింగాన్ని మింగిన ఘనుడు బాబు: జగన్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నారా లోకేష్ సోమవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ చేపడుతున్న నిరసనలపై వైసీపీ దాడి చేయడం హాస్యాస్పదం అన్నారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై దాడి చేయడం ద్వారా వైసీపీ ఏపీతో పాటు ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీకి హోదా విషయంలో కేంద్రం నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 30న తిరుపతిలో చంద్రబాబు దీక్ష చేపడుతున్నారు. వైసీపీ అదే రోజున విశాఖలో నిరాహార దీక్ష చేపట్టనుంది. దీనిపై లోకేష్ సెటైర్ వేశారు.
చంద్రబాబుపై జగన్ నిప్పులు
ఏపీలో చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందంటే గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసిన విధంగా ఉందని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు.. ఆలయాలకు, దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. టీడీపీ పాలనలో దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఈ అవినీతి సొమ్ము కిందిస్థాయి నుంచి లోకేష్, చంద్రబాబు వరకు కమిషన్ల రూపంలో వెళుతోందన్నారు.
'బాలకృష్ణకు చికిత్స అవసరం, మోడీ మాటలు సీరియస్గా
మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తోందనే కారణంతో బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలోని దేవాలయంలోని విగ్రహాలను కూడా రాత్రికి రాత్రి తరలించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువు పరిస్థితి ఇలాగే ఉందన్నారు. మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. చివరకు సీఎం కార్యాలయానికి 35 కి.మీ. దూరంలో కూడా ఇసుక వ్యాపారం జరుగుతోందన్నారు.