చంద్రబాబు వీరుడు; పవన్ కళ్యాణ్ శూరుడు: ఎందులోనో చెప్పిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల దూకుడు పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి నేతలు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు నేడు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన వైయస్ జగన్ చంద్రబాబు ని టార్గెట్ చేశారు.
చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని వైయస్ జగన్ మండిపడ్డారు. అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసివేశారని పేర్కొన్న వైయస్ జగన్ చిత్తూరు డెయిరీ నష్టాలలో ఉంటే, హెరిటేజ్ డెయిరీ మాత్రం లాభం లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది అని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నానన్న జగన్ 182 కోట్లు బకాయిలను తీర్చి చిత్తూరు డెయిరీ ని పునః ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఈ డెయిరీలో అమూల్ 325 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ సమయంలోనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు వైయస్ జగన్. చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్ళాడు చంద్రబాబు అంటూ ఆయనను టార్గెట్ చేసిన జగన్ చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు బాయ్ బాయ్ బాబు అంటున్నారని పేర్కొన్నారు.
మళ్ళీ ప్రజలను మోసం చెయ్యటానికి చంద్రబాబు రెడీ అవుతున్నాడని, ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామా చేస్తున్నారని జగన్ టార్గెట్ చేశారు.అంతేకాదు చంద్రబాబు మోసాన్ని దత్తపుత్రుడు బలపరుస్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకరు వెన్నుపోటు వీరుడు, ఇంకొకరు ప్యాకేజి శూరుడు అంటూ జగన్ ధ్వజమెత్తారు.
రైతులను, అవ్వాతాతలను ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబుకి తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం, తినడం అని పేర్కొన్న వైయస్ జగన్ చంద్రబాబు మంచిని కాకుండా మోసాన్ని నమ్ముకున్నారు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సామాజిక అన్యాయం చేయడం బాగా తెలుసన్నారు. తోడేళ్ళు అన్ని ఏకమవుతున్నాయి నమ్మకండి అంటూ జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి












Click it and Unblock the Notifications