సూపర్ సిక్స్ పూర్తయిందట..! ఇవన్నీ అమలు చేశారా ? జగన్ ప్రశ్నలు..!
అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్ అన్నాడని, అధికారంలోకి వచ్చాక అదే మహిళలకు వెన్నుపోటు పొడిచారన్నారు.
జగన్ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవని, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం పూర్తి చేసేశానంటున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ గురించి అడిగితే మీ నాలుక మందం అని చంద్రబాబు బెదిరిస్తున్నారన్నారు.
నిరుద్యోగ యవతకు నెలకు 3 వేల చొప్పున ఏడాదికి 36 వేలు ఇస్తామన్నారని, ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటిన్నర మంది నిరుద్యోగులు ఉన్నారని ఈనాడు రాసిందని, వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రశ్నించిన వారి నాలుక మందం అంటున్నారన్నారు. మహిళలకు ఏడాదికి 18500 ఇస్తామన్నారని, కోటీ 80 లక్షల మందికి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు పీ4 అని డ్రామాలు మొదలుపెట్టారన్నారు.

దీపం పథకం అమలు కోసం మొదటి ఏడాది 4109 కోట్లు ఇవ్వాల్సిన చోట్లు 800 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన మొత్తం మోసం కాదా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఒక్క సిలెండర్ పూర్తిగా ఇవ్వాలన్నా 1370 కోట్లు అవుతుందని, ఆ లెక్కన కూడా ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సు కోసం కడపలో మహిళలు ఎదురుచూస్తున్నారన్నారు. ఏడాది పూర్తయిందని, పండగల పేర్లు మారుతున్నాయని, కానీ పథకం మాత్రం అమలు కావడం లేదన్నారు. ఈ పథకం అమలుకు కమిటీలు, అధ్యయనాలు ఎందుకన్నారు.
50 ఏళ్లకే పెన్షన్ అన్నారని, తొలి ఏడాది ఎగ్గొట్టేశారని, రెండో ఏడాదీ ఇవ్వకుండా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నారని ఆక్షేపించారు. ఎన్నికల నాటికి 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే ఈ నెలలో 61 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చారన్నారు.అన్నదాత సుఖీభవ పథకం కింద గతేడాది ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదని, ఇది మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఆంక్షలు లేవు, కటింగ్స్ లేవు తల్లికి వందనంలో పూర్తి మొత్తం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏం చేశారో అందరూ చూశారన్నారు.
తల్లికి వందనం పథకంలో ఇస్తానంటున్న మొత్తం 8700 కోట్లని, ఇచ్చేసరికి అది ఎంతమందికి వస్తుందో తెలియదన్నారు. దాదాపు 30 లక్షల మందికి ఈ పథకంలో కోత పెట్టారని ఆరోపించారు. దీనిపై తాము నిలదీస్తే 13 వేలే ఇస్తామని చెప్పేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు నీకు.నీకు.నీకు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కొందరికే 13 వేలు ఇచ్చారని, ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన సంస్కరణలన్నీ నాశనం చేశాడన్నారు.
తమ హయాంలో ప్రభుత్వ బడులకు నో వేకెన్సీ బోర్డులు కనిపించేవని, ఇప్పుడు పరిస్దితి పూర్తిగా మారిపోయిందన్నారు. తమ హయాంలో ప్రతీ మూడు నెలలకు పథకాల డబ్బులు విడుదల చేసే వాళ్లమని, కానీ ఇప్పుడు ఏడాది దాటినా పథకాల డబ్బులు లబ్దిదారులకు అందలేదన్నారు. ఏయే పథకాల డబ్పులు గతంలో ఎలా వచ్చేవో, ఇప్పుడు ఎలా రాకుండా ఆగిపోతున్నాయో జగన్ లెక్కలతో సహా వివరించారు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీని వర్తింపచేశామని, కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కనబెట్టేస్తున్నారన్నారు.
చంద్రబాబు కొన్ని మాత్రం చేశారని,ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనన్నారు. కరెంటు ఛార్జీల బాదుడు 15 వేల కోట్లు చేశారని, ప్రభుత్వ స్కూల్లు, కాలేజీలను చంపేసి ప్రైవేటులో ఫీజులు పెంచి బాదేస్తున్నారని తెలిపారు. అన్ని పన్నులు పెంచి ఇంటి అద్దెల బాదుడు చేస్తున్నారని, హెరిటేజ్ కోసం అమూల్ ను చంపేసి పాల రేట్లు బాదేస్తున్నారన్నారు. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా ఆపేశారన్నారు. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోయినా 3 లక్షల ఉద్యోగాలు తీసేశారని గుర్తుచేశారు. వాలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్లసహా పలు ఉద్యోగాలు పోయాయన్నారు. ఉద్యోగులకు సైతం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారన్నారు.
తాము ఐదేళ్లలో 3.32 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఏడాదిలో 1.61 కోట్లు అప్పు చేశారన్నారు. ఇందులో అమరావతికే 31 వేల కోట్లు ఉన్నాయన్నారు. ఆదాయాలు చూస్తే తమ ప్రభుత్వంలో ఏడాదికి 93354 కోట్లు వస్తే చంద్రబాబు ప్రభుత్వంలో 96227 కోట్లకు మాత్రమే పెరిగాయన్నారు. దేశంలో పన్ను ఆదాయాల పెరుగుదల 12.04 శాతం ఉంటే ఏపీలో మాత్రం కేవలం 3.08 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మేలో చూసినా సగటున తమ ప్రభుత్వంలో 14644 కోట్లు వస్తే చంద్రబాబు హయాంలో అది కాస్తా తగ్గి 14579 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. తాను ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదని, మద్యం ఆదాయాన్ని హామీగా పెట్టడం లేదని చెప్తున్న చంద్రబాబు 1.91 లక్షల కోట్ల క్వారీ లీజులు, మైనింగ్ హక్కుల్ని తాకట్టు పెట్టడం నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఇంకా ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులు కట్టబెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ ఇళ్లకు వస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను రెడీగా పెట్టుకుని వారికి చూపించి నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. తాము కూడా ఆ మ్యానిఫెస్టోను క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజలు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచుతామన్నారు. అప్పట్లో సూపర్ సిక్స్ హామీల లబ్దిదారులకు ఫోన్లలో మెసేజ్ లు ఎలా పంపారో, అందులో ఐదేళ్లకు ఎంత మొత్తం ఇస్తారో కూడా చెప్పారన్నారు. జూన్ 2024 నుంచే ఈ పథకాలు అమలు చేస్తామని కూడా బాండ్ ఇచ్చారన్నారు. దీన్ని బట్టి చూస్తే లబ్దిదారులకు చంద్రబాబు ఈ మొత్తం బాకీ ఉన్నాడన్నారు. కాబట్టి మ్యానిఫెస్టో డౌన్ లోడ్ చేసుకుని టీడీపీ నాయకులు తమ ఇళ్లకు వచ్చినప్పుడు బాకీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అడగాలన్నారు.












Click it and Unblock the Notifications