బ్లాక్ డే, రేపు బంద్: టీ బిల్లు ఆమోదంపై జగన్
హైదరాబాద్: లోకసభలో తెలంగాణ బిల్లును ఆమోదించిన తీరుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లును ఆమోదించిన ఈ రోజు బ్లాక్ డే అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించినందుకు నిరసనగా రేపు (బుధవారం) బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సభ తలుపులు మూసేశారని, ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేశారని, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేశారని, ఓటింగ్ లేకుండా బిల్లును ఆమోదించారని ఆయన అన్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతా అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చేశారని ఆయన అన్నారు.

తాము దేశంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. నియంత పోకడలతో రాష్ట్రాన్ని విడగొడుతున్నారని ఆయన అన్నారు. నియంత అంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్తుకు వస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.
పాకిస్తాన్లో కూడా ఇలా జరగదేమోనని, చాలా బాధనిపిస్తోందని జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు, బిజెపి, చంద్రబాబు నాయుడు కారణమని ఆయన అన్నారు. వీళ్లు మనుషులేనా అని ఆయన అడిగారు. అధికార, ప్రతిపక్షాలు ఒక్కటైతే ప్రజాస్వామ్యం ఉంటుందా అని ఆయన అడిగారు.
నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లాలని అడిగితే, చదువుల కోసం ఎక్కడికి వెళ్లాలని అడిగితే పట్టించుకోలేదని ఆయన అన్నారు. హైదరాబాదు ఆదాయం లేకపోతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications