రేపు గుంటూరులో అలీ కుమార్తె రిసెప్షన్- జగన్, మంత్రులతో పాటు పలువురు అతిథులు..
టాలీవుడ్ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్ కార్యక్రమం రేపు గుంటూరులో అట్టహాసంగా జరగబోతోంది. రేపు సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సీఎం జగన్ సహా పలువురు అతిధులు హాజరుకాబోతున్నారు.
వైసీపీకి మద్దతుగా గత ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ ప్రచారం చేసిన అలీకి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తన కుమార్తె పెళ్లికి జగనన్న ఇచ్చిన గిఫ్ట్ గా దీన్ని అభివర్ణించారు. తాజాగా హైదరాబాద్ లో అలీ కుమార్తె వివాహం జరిగింది. దీనికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న అలీ రాష్ట్రంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. గుంటూరులో ముస్లింలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, వీఐపీలకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో రేపు సాయంత్రం వీరంతా అలీ కుమార్తె రిసెప్షన్ కు హాజరై ఆశీర్వదించబోతున్నారు. అలాగే రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ సలహాదారు హోదాలో నిర్వహిస్తున్న వేడుక కావడంతో ప్రోటోకాల్ ఉంటుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రాకతో భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అలీ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యేందుకు సీఎం జగన్ రేపు సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ కన్వెన్షన్కు చేరుకుంటారు. అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications