బాబు కంటే జగన్ మొండి!: 'రోజా'తో పైఎత్తు, ఆమె ఎందుకు తగ్గట్లేదు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నటి రోజాను వ్యూహాత్మకంగా చంద్రబాబుపై ప్రతి దాడి కోసం ఉపయోగించుకుంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందుకు తెలుగుదేశం పార్టీ నేతలు నిదర్శనం కూడా చూపిస్తున్నారు. అసెంబ్లీలో తమ వ్యవహార శైలి పైన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు క్షమాపణలు చెప్పారు. ప్రివిలేజ్ కమిటీలో తమ వాదనలు వినిపిస్తూనే, క్షమాపణలు చెప్పారు.
ప్రభుత్వం తీరుపై నిత్యం నిప్పులు చెరిగే సాక్షి పత్రిక కూడా క్షమాపణలు చెప్పినట్లు స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. శాసనసభను కించపరిచనందుకు సాక్షి పత్రికకు నోటీసు ఇచ్చామని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని సాక్షి యాజమాన్యం సమాధానం ఇచ్చారని చెప్పారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరకు తన సాక్షి పత్రిక క్షమాపణలు చెప్పినప్పటికీ.. రోజా మాత్రం తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఆమె క్షమాపణకు సిద్ధంగా లేరు. హైకోర్టులో రోజాకు అనుకూలంగా మధ్యంతర తీర్పు వచ్చినప్పటికీ, ఆమె తీరును న్యాయస్థానం తప్పుబట్టింది.
రోజా మాత్రమే తగ్గక పోవడం వెనుక జగన్ వ్యూహంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజాకు జనాల్లో ఇమేజ్ ఉంది. ఆమె సినీ నటి, పైగా, ఆమె చాలాకాలం తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఈ కారణంగా రోజా ద్వారా వెళ్తే మైలేజ్ ఉంటుందనే జగన్ ఆమె విషయంలో మాత్రం తగ్గడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
బయట రోజాకు ఉన్న స్టార్ ఇమేజ్, పార్టీలో చేరినప్పటి నుంచి చంద్రబాబుతో ఆమె పోరు.. కారణంగా ఆమె ఒక్కరు తగ్గకుంటే చాలని జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఒకవిధంగా రోజా పైన వేటు వేసే విషయంపై చంద్రబాబు ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో, రోజాపై తగ్గకపోవడంపై జగన్ అంతే మొండిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.