మరో పోరుబాటకు జగన్ నిర్ణయం, నిరసన దీక్ష- అక్కడే మొదలు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అటు కూటమిలోని మూడు పార్టీలు రాజకీయంగా తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మాజీ సీఎం జగన్ పోరుబాట పట్టారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం వ్యతిరేకిస్తూ.. నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28న ధర్నాలకు నిర్ణయించారు. తాజాగా మరో పోరుబాటకు జగన్ సిద్దమయ్యారు. స్వయంగా నిరసన దీక్షకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు వెల్లడించారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ మద్దతుగా నిలిచింది. ఛలో రాజయ్యపేటకు నిర్వహించారు. వారికి మద్దతు పలికారు. మాజీ మంత్రి బొత్సా పార్టీ తరపున మత్స్యకారులకు సంఘీభావం ప్రకటించారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. మత్స్యకారులకు నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. వీరికి మద్దతుగా మాజీ సీఎం జగన్ రాజయ్యపేట వస్తారని బొత్సా వెల్లడించారు. బాధితులకు జగన్ మద్దతుగా నిలుస్తారని.. నిరసనలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు.

ప్రజలు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలని బొత్సా ప్రశ్నించారు. తాము జగన్ ఆదేశాల మేరకే బాధితుల వద్దకు వచ్చామని.. వారి ఆవేదన జగన్ కు వివరిస్తామని చెప్పుకొచ్చారు. హోం మంత్రి అనిత తీరు పైన బొత్సా ఆగ్రహం వ్యక్తం చేసారు. బల్క్ డ్రగ్ పార్క్ పైన ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని మాజీ మంత్రి కన్నబాబు గుర్తు చేసారు. బల్క్ డ్రగ్ పార్క్ కు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేసారు. పరిశ్రమల వ్యర్ధాలు సముద్రంలో కలుషితం చేస్తాయని.. వేట పై ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం చేస్తాయని స్థానికుల వివరించారు. తమ బాధ అర్దం చేసుకోమని నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో జగన్ రాజయ్య పేటకు వస్తారని.. మద్దతుగా నిలుస్తారని వైసీపీ నేతలు మత్స్యకారులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications