'రాజధానిపై చిచ్చురేపేందుకే జగన్': ఆయనిష్టం కాదని..
చిత్తూరు/హైదరాబాద్: రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చురేపేందుకు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఆరోపించారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక పైన మంత్రివర్గంలో చర్చించినట్లు చెప్పారు. మంత్రి వర్గ నిర్ణయం పైన గురువారం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారన్నారు. సమావేశాల సమయంలో మంత్రివర్గ నిర్ణయాలను సభలో ప్రకటించడం ఆనవాయిదీ అని, సభా వ్యవహారాలు తెలియకుండా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ప్రకటన తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని, రాజకీయ దురుద్దేశ్యంతో జగన్ సభను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
జగన్ పార్టీపై మండిపడ్డ గోరంట్ల
కుక్కతోక వంకరలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మూడు రోజులపాటు శాసనసభలో సవ్యంగానే వ్యవహరించి, మళ్లీ మొదటికొచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
జగన్ అసెంబ్లీని తన ఇష్టప్రకారం నడపాలనుకుంటున్నారన్నారు. జగన్ అత్యవసరంగా శాసనసభ వ్యవహారాలు, నియమాలపై ఎవరైనా నిపుణుడితో శిక్షణ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్కు దోచుకోవడంలో ఉన్న విజన్ అసెంబ్లీ పద్ధతులు, నియమాలు తెలుసుకోవడంపై లేదన్నారు.