సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న జగన్, విజయసాయిరెడ్డి-కారణాలివే !
ఏపీలో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై గతంలో అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు సాగుతోంది. ఇది పూర్తయి సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో సీబీఐ ముందా ఈడీ ముందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. వైఎస్ జగన్, సాయిరెడ్డి మాత్రం ఈ సీబీఐ, ఈడీ పిటిషన్లపై ఒకేసారి విచారణ జరపాలని లేదా సీబీఐ పిటిషన్లనే ముందు విచారించాలని కోరారు. దీనిపై సీబీఐ కోర్టు గతంలో ఈ రెండు పిటిషన్లపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ హైకోర్టు,సుప్రీంకోర్టులో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ముందుగా సీబీఐ పిటిషన్లపై విచారణ జరపాలని, అందులో నేరం నిరూపణ కాకపోతే ఈడీ కేసులపై విచారణ అవసరం లేదని నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జగన్, విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు పూర్తి కాగానే కోర్టులో దాఖలు చేసే ఛార్జిషీట్లు నిరూపణ కాకపోతే ఇక ఈడీ కేసులు కూడా ఉండవన్న మాట. దీంతో ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టులో జగతి పబ్లికేషన్స్ తో పాటు పలు సంస్ధల తరఫున దాఖలు చేసిన పిటిషన్లను వీరిద్దరూ ఉపసంహరించుకున్నారు.
గతంలో కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ స్దాపించిన తర్వాత వైఎస్ జగన్, సాయిరెడ్డితో పాటు పలు సంస్ధలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం ఈడీ కూడా కేసులు నమోదుచేసింది. ఈ రెండు సంస్ధల విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వీటిలో తీర్పు ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియడం లేదు. గతంలో సుప్రీంకోర్టు కూడా సీబీఐ, ఈడీ కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఆ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేస్తే వాటిపై విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ కోర్టు సమాయమత్తమవుతోంది. అందులో జగన్ సహా మిగతా వారు కూడా నిర్దోషులుగా తేలితే ఇక ఈడీ కేసులు కూడా తేలిపోవడం ఖాయం.