పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా: జగన్ ఫైర్
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం జిల్లాలోని పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పులివెందులలోని పర్యటనలో భాగంగా ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజాదర్బార్లో పాల్గొని వినతులు స్వీకరించారు.
అంతరం పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె పంచాయితీ పరిధిలో ఉన్న మొట్నూతలపల్లెకు చెందిన రైతు రాజశేఖర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అప్పుల బాధ తాళలేక అక్టోబర్ 19వ తేదీన పొలం వద్దనే రైతు రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకున్న మూడు ఎకరాల పొలంతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని అరటిని సాగు చేశాడు. అయితే నిరుడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లలో నీరు అడుగంటిపోవడంతో అరటి చెట్లు ఎండిపోయాయి. దాదాపు రూ. 16 లక్షలు అప్పు ఎలా తీర్చాలో దిక్కు తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు.
పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా అని వైయస్ జగన్ ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంపై అడిగారు. రాజశేఖర్ చనిపోయి 18 రోజులైనా ఒక్క అధికారి కూడా వాళ్లింటికి రాలేదని ఆయన అన్నారు.
పబ్లిసిటీ వస్తుందనుకుంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, ఇలాంటి పేద రైతును మాత్రం పట్టించుకోదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో తాను 46 కుటుంబాలను పరామర్శిస్తే, వాటిలో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేలా మీడియా కూడా రైతుల దినగాధలను ఆవిష్కరించాలని ఆయన సూచించారు.
ఆ తర్వాత, ఇటీవల వార్డు కౌన్సిలర్ అరుణకుమారి కుమారుడి వివాహం జరిగిన నేపథ్యంలో వారింటికి వెళ్లి జగన్.. నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు.