జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు: తీవ్ర ఆరోపణలు: సమగ్ర విచారణ: ప్రశాంత్ భూషణ్, ఐవైఆర్
అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ..కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. సుప్రీంకోర్టు న్యాయయూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ రాసిన ఈ లేఖ న్యాయవ్యవస్థను ప్రశ్నించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యమంత్రి.. తన లేఖలో పేర్కొన్న అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు చెబుతున్నారు. లోపాలను సవరించడానికి దీన్నొక అవకాశంగా తీసుకోవాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.

లేఖలోని అంశాలు తీవ్రమైనవి..
వైఎస్ జగన్.. జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డేకు రాసిన లేఖపై సమగ్ర దర్యాప్తును చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఎన్వీ రమణ అవినీతిపరుడని, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారంటూ ఈ లేఖ ద్వారా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున న్యాయస్థానాల్లో తన ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్ చేసిన ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సత్వర విచారణ..
వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ప్రశాంత్ భూషణ్ అన్నారు. దీనిపై శరవేగంగా విచారణ జరపాలని చెప్పారు. ఈ దర్యాప్తు ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కాపాడినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. మరోవంక- రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. వైఎస్ జగన్ రాసిన లేఖపై జాతీయ స్థాయిలో ఓ చర్చ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ న్యాయాధికారుల నియామక కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

జాతీయ న్యాయధికారుల నియామక కమిషన్ ఏర్పాటుకు..
జాతీయ న్యాయాధికారుల కమిషన్ ద్వారా మాత్రమే నియామకాలను చేపట్టాల్సి ఉంటుందని, ఆ దిశగా సత్వర చర్యలను తీసుకోవాలని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జ్యుడీషియల్ సర్వీసుల్లో నియామకాలను చేపట్టడానికి తాను అనుకూలం కాదని ఐవైఆర్ అన్నారు. ఐఎఎస్, ఐపీఎస్ నియామకాల్లోనూ రాజకీయాలు చొచ్చుకెళ్లాయని, జ్యుడీషియల్ సర్వీసులు కూడా దానికి భిన్నంగా ఏమీ ఉండబోవని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక నాణ్యమైన కమిషన్ ద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ అవసరాన్ని తీర్చగలదని చెప్పారు.
Recommended Video

తెలుగు ప్రజల దౌర్భాగ్యం..
తెలుగు మీడియా రంగంపైనా ఐవైఆర్ విమర్శలు గుప్పించారు. తెలుగులో స్వతంత్ర ప్రింట్ మీడియా లేకపోవడం.. తెలుగు ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధం లేకుండా ఈ సమస్య పీడిస్తోందని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. మీడియా మాత్రం స్వతంత్రంగా పని చేయలేకపోతోందని అన్నారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ ఈ అంశాన్ని తాను చాలాసార్లు ప్రస్తావించానని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత కూడా అదే దుస్థితి కొనసాగుతోందని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.












Click it and Unblock the Notifications