రెండు రాష్ట్రాల్లో వైసీపీ ఖాళీ!: బాబుపై జగన్ 'తెలంగాణ' యుద్ధం
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను షాక్ తగులుతోంది. ఓ వైపు తెలంగాణలో వైసిపి మూతపడుతుండగా, ఏపీలో ఆ పార్టీ నుంచి ఒక్కరొక్కరుగా సైకిల్ ఎక్కుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో... తెలంగాణలో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. ఆ గెలిచింది కూడా ఖమ్మం జిల్లాలో. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలోనే కారు ఎక్కారు. తాజాగా, ఎంపీ, తెలంగాణ వైసిపి అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
తద్వారా తెలంగాణల వైసిపి ఖాళీ అయింది. ఏపీలోను గత సార్వత్రిక ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఇప్పటికే దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొందరు ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల నాటికి 30 నుంచి 40 మంది చేరుతారని టిడిపి నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో మొదటి నుంచి వైసిపి బలహీనంగా ఉంది. ఏపీలో మాత్రమే బలంగా ఉంది. జగన్ కూడా తెలంగాణపై అంతగా శ్రద్ధ పెట్టలేదని చెప్పవచ్చు. కేవలం ఏపీ పైనే ఆయన దృష్టి సారిస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో తన పార్టీ ఖాళీ అయినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఏపీలో మాత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన దుమ్మెత్తి పోస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతున్నారు. జగన్ వైఖరిని ఏపీ టిడిపి కూడా ప్రశ్నిస్తోంది.

తెలంగాణలో తన పార్టీ నుంచి తెరాసలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడని జగన్, కేవలం ఏపీలో చేరికల విషయం పైనే మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆయన కెసిఆర్దీ తప్పేనని చెప్పారు. ఆయన తీరు వల్లే వైసిపి నుంచి పలువురు టిడిపిలో చేరుతున్నారు.
తెలంగాణలో కెసిఆర్తో దోస్తీ కారణంగానే జగన్ తన ఎమ్మెల్యేలు, ఎంపీ కారు ఎక్కినా పట్టించుకోవడం లేదని టిడిపి నేతలు దుయ్యబడుతున్నారు. అదే సమయంలో, ఏపీలో మాత్రం ఎమ్మెల్యేలు అభివృద్ధిని చూసి, జగన్ వైఖరి భరించలేక వస్తున్నారని చెబుతున్నారు.
జగన్ తన అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యూహాలే పార్టీ విధానాలుగా మార్చేశారని, అందుకే ఏపీలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. వైసిపిలో సీనియర్ల మాట కూడా జగన్ పెడ చెవిని పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అదే సమయంలో, ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని చంద్రబాబును రెచ్చగొట్టారని, దీంతో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందని, ఇది జగన్కే చేటు తెచ్చిందని అంటున్నారు.
ఇక, తెలంగాణలో వైసిపి ఖాళీ అయినా జగన్ పట్టించుకోకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి కెసిఆర్తో అంతర్గతంగా దోస్తీ ఉందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరొకటి, చంద్రబాబు పైన పోరాడేందుకు 'తెలంగాణ' ఆయుధాన్ని కూడా ఓ రకంగా జగన్ ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలో పార్టీ లేకపోయినా ఫరవాలేదు అన్న అభిప్రాయం జగన్లో ఉందని అంటున్నారు. అందుకే తెలంగాణలో ప్రజాప్రతినిధులు అందరూ కారు ఎక్కినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన జగన్ దీక్షకు పూనుకున్నారు. పేరుకు దీక్ష తెలంగాణ పైన అయినా.. చంద్రబాబును కార్నర్ చేసేందుకేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications