ఎక్కడైనా పెట్టండి కానీ: జగన్, బెజవాడకి విముఖమా?
హైదరాబాద్: రాజధాని అంశం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బుధవారం హెచ్చరించారు. శ్రీమంతులకే ఉపయోగపడే రాజధాని మనకు అవసరమా అని జగన్ ప్రశ్నించారు.
రాజధాని ఎంపిక పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు. రాజధాని కోసం 35 నుండి 40వేల ఎకరాలు ఉండాలన్నారు. రాజధానిని ఎక్కడైనా పెట్టుకోండి తమకు అభ్యంతం లేదని కానీ, శ్రీమంతులకు ఉపయోగపడే రాజధాని వద్దన్నారు. సభలో రాజధాని పైన చర్చ తర్వాతనే ప్రకటన చేయాలన్నారు.
భవిష్యత్తులో ఉద్యమాలు తలెత్తకుండా ఉండేందుకే తాము చర్చను కోరుతున్నామని జగన్ హెచ్చరించారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి జరిగిన చోటనే రాజధాని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరికోసమే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలా రాజధాని ఉండాలన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక పైన చర్చ జరగాలన్నారు.
కర్నూలు రాజధాని కోసం..
గుంటూరు - విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలులో విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్ర, రాయలసీమ మధ్య జరిగిన శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని కర్నూల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, రాజధాని విషయమై లెఫ్ట్ పార్టీ నేత మధు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాజధాని పైన ప్రకటన చేసే ముందు అఖిలపక్షం నిర్వహించాలన్నారు.