వైసీపీ కార్యకర్తలకు జగన్ పిలుపు-నేడు, రేపు కలిసేందుకు ఛాన్స్-ప్రక్షాళనకు ఫీడ్ బ్యాక్ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో పూర్తిగా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టిపెట్టిన సీఎం జగన్.. అటు పార్టీపై దృష్టి పెట్టలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. తొలిసారి అధికారంలోకి రావడం, పార్టీ కంటే ప్రభుత్వంపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన పరిస్ధితుల్లో పార్టీకి కొంత దూరమయ్యారు. దీంతో కార్యకర్తలతో పాటు నేతల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. అదే సమయంలో మరో రెండేశ్లలో జరిగే ఎన్నికల్లో అధికారం దక్కాలంటే వీరి పాత్ర కీలకం. దీంతో ఇవాళ, రేపు వారిని నేరుగా పిలిపించుకుని మాట్లాడేందుకు రంగం సిద్ధం చేశారు.

క్యాడర్ కు దూరమైన జగన్
పదేళ్ల పాటు శ్రమించి వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ కార్యకర్తలు అందించిన సహకారం అసాధారణమైనది. గత ప్రభుత్వాల్లో కేసులు ఎదుర్కొని, జగన్ పై నమ్మకంతో అహరహం శ్రమించిన వీరంతా పార్టీ అధికారంలోకి రాగానే తమకు ఏదో విధంగా మేలు జరుగుతుందని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ అందరితో పాటు క్యాడర్ కూ దూరమయ్యారన్న ప్రచారం ఉంది. ప్రభుత్వ పాలనలో పడి పార్టీని పట్టించుకోలేదని, కిందిస్ధాయి కార్యకర్తల్ని గతంలోలా పలకరించే సమయం కూడా ఆయనకు లేదనే వాదన ఉంది. దీంతో పార్టీ క్యాడర్ కు జగన్ దూరమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అలా వదిలేస్తే
అధికార మత్తులో పడి పార్టీ క్యాడర్ ను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ నేతల పరిస్ధితీ అదే. ఎంతసేపూ జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి అన్నీ సజావుగా ఉంటాయన్న ధీమా ఉండటంలో తప్పులేదు కానీ అది అతివిశ్వాసంగా మారితే మాత్రం ప్రమాదం తప్పదు. ముఖ్యంగా అప్రమత్తంగా లేకపోతే ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా కూడా పొంచి ఉన్న పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరంకాక తప్పదు. దీంతో జగన్ ఇప్పుడు మళ్లీ క్యాడర్ కు చేరువయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

రెండురోజులు తనను కలిసేందుకు ఛాన్స్
ప్రభుత్వానికీ, పార్టీకి పెరుగుతున్న గ్యాప్, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్దితుల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ క్యాడర్ కు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తున్న జగన్.. ఇవాళ, రేపు తనను నేరుగా కలిసేందుకు కార్యకర్తలకు ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ ను నేరుగా కార్యకర్తలు కలవొచ్చని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో జగన్ ను కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు తరలివస్తున్నారు. వీరు ఇవాళ, రేపు జగన్ తో భేటీ అయి క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితుల్ని ఆయనకు వివరించే అవకాశం ఉంది.
Recommended Video


జగన్ ప్రక్షాళన అక్కడి నుంచే ?
రెండు రోజుల పాటు కార్యకర్తలతో నేరుగా భేటీ అయ్యే జగన్.. అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను తీసుకుని వాటిని క్రోడీకరించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే రాబోయే రోజుల్లో మంత్రులకు కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2024 ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని అంశాలు, సమీకరణాలు ప్రాతిపదికగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా క్షేత్రస్ధాయి నుంచి జరిగే ప్రక్షాళనతో సమస్యలు కొంతవరకైనా తగ్గుతాయని, పార్టీ క్యాడర్ లో విశ్వాసం పెరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎలాగో మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత రెండేళ్లకు టికెట్ల కేటాయింపులు ఎలాగో ఉండబోతున్నాయి. వాటన్నింటికీ తొలి అడుగు ఇక్కడే పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications