అమరావతిలో జగన్ నివాసం, టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహమిదే
అమరావతి నుండి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు అమరావతిని కేంద్రంగా చేసుకొని నివాసం ఉండాలని కూడ ఆయన భావిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి కేంద్రంగా సాగుతున్నాయి. అయితే టిడిపి తో సహ ఇతర పార్టీలన్నీ దాదాపుగా విజయవాడ, గుంటూరు కేంద్రంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి.అయితే వైసిపి మాత్రం హైద్రాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను సాగిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు తొలిసారిగా అమరావతిలో సాగుతున్నందున తొలిసారిగా వైసిపి ఎమ్మెల్సేలు,ఎమ్మెల్సీలు అమరావతి కేంద్రం ఉంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు.
అయితే అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అధికార పార్టీకి ధీటుగా జవాబు చెప్పే అవకాశం ఉందని వైసిపి సీనియర్లు భావిస్తున్నారు. దరిమిలా అమరావతి నుండి పార్టీ కార్యకలాపాల నిర్వహణకు గాను వైసిపి అధినేత జగన్ కూడ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
అమరావతి నుండి వైసిపి కార్యకలాపాలకు జగన్ నిర్ణయం
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి వైసిపి అధినేత జగన్ పార్టీ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన త్వరలోనే అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైద్రాబాద్ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి నుండి పార్టీ కార్యకలాపాలు సాగించడం ద్వారా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీనికి ఆయన కూడ సానుకూలంగానే స్పందించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం
విజయవాడలో వైసిపి పట్టు సాధించాలంటే టిడిపికి అండగా ఉన్న సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న మరో సామాజికవర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాపు, బ్రహ్మణ సామాజిక వర్గాల సహయంతో పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే త్వరలో వైసిపిలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
విజయవాడలో నివాసానికి జగన్ ప్లాన్
గుంటూరు, విజయవాడలో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని జగన్ నిర్ణయించారు. అయితే జగన్ విజయవాడలో జగన్ నివాసం ఉండాలని భావిస్తున్నారు. విజయవాడలో ఉండడం ద్వారా పార్టి కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని వైసిపి నాయకులు భావిస్తున్నారు.హైద్రాబాద్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఉపయోగం లేదని, విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా పార్టీకి ప్రయోజనం ఉంటుందని వైసిపి నాయకులు భావిస్తున్నారు.ఇటీవల మీడియా కవరేజీ విషయాన్ని నాయకులు జగన్ వద్ద ప్రస్తావించారు.జగన్ కు తన నివాసం ఇచ్చేందుకు మజీ ఎమ్మెల్యే వెల్లం శ్రీనివాస్ ముందుకు వచ్చారు.అయితే సువిశాలమైన స్థలంలో మంచి ఇల్లును కట్టిస్తానని మాజీ మంత్రి పార్థసారథి జగన్ కు చెప్పారు.అయితే ఈ విషయమై జగన్ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
అధికార పార్టీ కూడ జాగ్రత్తగా నడుచుకోనుంది
అధికార పార్టీ కూడ జాగ్రత్తగా నడుచుకోవాలంటే జగన్ అమరావతి నుండి పార్టీ కార్యకలాపాలను సాగించాలని ఆ పార్టీ నాయకులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న సెక్షన్లు, గ్రూపులు, సామాజికి వర్గాలు కలిసి వచ్చేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదని వైసిపి నేతలు చెబుతున్నారు.అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల పార్టీ క్యాడర్ లో కూడ ఉత్సాహం వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ అంశాలపై జగన్ కూడ సానుకూలంగానే స్పందించారని సమాచారం.