స్కూలు బస్సును ఢీకొట్టిన రైలు.. పలువురు దుర్మరణం!
ఐరోపా దేశమైన బెల్జియంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. రెప్పపాటు కాలంలో జరిగిన ఓ ఘోర రైలు ప్రమాదం పలువురి ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తర బెల్జియం ప్రాంతంలో పాఠశాల చిన్నారులతో వెళ్తున్న మినీ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులతో సహా పలువురు అక్కడికక్కడే మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు, స్థానిక అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఉత్తర బెల్జియం పరిధిలోని 'బుగ్గెన్హౌట్' అనే ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఈ ఊహించని దారుణం చోటుచేసుకుంది.
ఈ ప్రమాద తీవ్రత ఆ మినీ బస్సు పూర్తిగా ధ్వంసమై రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో ఏడుగురు విద్యార్థులు, ఓ సూపర్వైజర్, డ్రైవర్ ఉన్నట్లు స్థానిక పోలీసు ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

అయితే ఈ ప్రమాదంలో ఖచ్చితంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే వివరాలను బెల్జియం పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం. కానీ ప్రమాదం జరిగిన తీరు మాత్రం అత్యంత భయానకంగా ఉందని ఇన్ఫ్రాబెల్ ప్రతినిధి ఫ్రెడరిక్ సాక్రే పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సుమారు 8:08 గంటల సమయంలో ఈ దారుణం జరిగిందని, కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తదుపరి స్టేషన్లో ఆగాల్సిన రైలు.. ఈ పాఠశాల బస్సును ఢీకొట్టిందని ఆయన వివరించారు.
🇧🇪 A train collided with a school minibus at a level crossing in Buggenhout, Belgium at around 8:15 AM local time this morning, killing at least four people.
— Europa.com (@europa) May 26, 2026
Several others were seriously injured after the minibus was struck and overturned.
Follow: @europa pic.twitter.com/qgxrOoopf9
ఈ హృదయవిదారక ఘటనపై బెల్జియం అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ క్వింటిన్ తీవ్రంగా చలించిపోయారు. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ బాధితులకు తన మద్దతును ప్రకటించారు. "బుగ్గెన్హౌట్ ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఈ ప్రమాద బాధితులకు, వారి కుటుంబ సభ్యులకే తోడుగా ఉంటాయి. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు, ఇతరులు త్వరగా కోలుకోవాలని, వారికి ఈ కష్ట సమయంలో దేవుడు మరింత గుండె నిబ్బరాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని ఆయన రాసుకొచ్చారు. ఈ ప్రమాదంతో బెల్జియం దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications