జగన్ అనుభవమే..: నాడు కొడుకుకి, నేడు తల్లికి చేదు!

YS Jagan and YS Vijayamma
హైదరాబాద్: మూడేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తాజాగా గురువారం ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణ జిల్లాల్లో ఊహించని చేదు అనుభవం ఎదురయింది. తెలంగాణ వైపు అడుగులు పడుతున్న సమయంలో విజయమ్మ అందుకు భిన్నమైన ప్రకటనలు చేయడంతో తెలంగాణవాదులు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు.

జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎంపి చేతిలో ఉన్న ప్లకార్డును తీసుకొని మరీ ఆయన సమైక్యమన్నారు. ఆ తర్వాత తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం వచ్చిన జగన్‌ తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అప్పటికి జగన్ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర కోసం మహబూబాబాద్‌కు రైలులో వెళ్లారు.

అయితే ఆయన రాకను నిరసిస్తూ తెలంగాణవాదులు రైల్వే స్టేషన్‌లో హల్ చల్ సృష్టించారు. నాడు జగన్ వర్గంగా ఉన్న కొండా సురేఖకు, తెలంగాణవాదులకు మధ్య రాళ్ల వర్షం కురిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకొని తరలించారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించామన్నారు. అంతేకాకుండా విభజన నిర్ణయం తమ చేతుల్లో లేదని కేంద్రం చేతుల్లో ఉందని ప్రకటించారు.

నాడు ఎంపీగా ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తే అప్పుడు జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారని, ఇప్పుడు పార్టీ పెట్టారని, పార్టీ నిర్ణయం చెప్పారని తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చేవారు. ఆ తర్వాత తెలంగాణలో జగన్ దీక్షలు, పర్యటనలు చేశారు. అయితే విభజనకు అనుకూలంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకోక పోవడంతో పోయిన ఏడాది విజయమ్మ సిరిసిల్ల పర్యటనను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని ఆ పార్టీ నేతలకు ఆయా నియోజకవర్గాలలో మంచి పట్టు ఉంది. అందులో సిరిసిల్ల మాజీ శాసన సభ్యుడు కెకె మహేందర్ రెడ్డి ఒకరు. అప్పుడు ఆ పార్టీలో ఉన్న కెకె.. అడ్డంకులు ఏర్పడినా ఆమె సభను విజయవంతమయ్యేలా చూశారు. అయితే ఇటీవల ఆ పార్టీ పూర్తిగా సమైక్యవాదం వినిపిస్తుండటంతో కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొండా సురేఖ వంటి హేమాహేమీలు ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు.

సమైక్య నినాదం ఎత్తుకున్న తర్వాత విజయమ్మ తొలిసారి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించారు. ఆమెకు అడుగడుగునా అడ్డంకులు తగిలాయి. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో విభజన జరగదని ఆమె చెప్పడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటన పూర్తయ్యాక ఆమె నల్గొండ జిల్లాకు బయలుదేరిన సమయంలో పైనంపల్లి వద్ద ఆమెను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+