వైఎస్ జగన్కు KGF వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) తీవ్రంగా ఖండిస్తూ జగన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
ఈ సందర్భంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ వైఖరిని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం మానవత్వం గల చర్యగా అభినందనీయమన్నారు.కానీ ఈ సందర్భాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించేలా, అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం, ఖండనీయమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్ను హెచ్చరిస్తున్నామని కేజీఎఫ్ నాయకులు తెలిపారు.
రాజకీయ నాయకులకు హెచ్చరిక
గతంలో తెలంగాణలో కేటీఆర్, ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో కమ్మ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా చెల్లించుకున్న మూల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.2023 తెలంగాణ ఎన్నికలో బీఆర్ఎస్ ఘోరఓటమి తరువాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం ఈ విషయాన్ని రుజువు చేస్తుందన్నారు. ఇకపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తే, కమ్మ సామాజిక వర్గం మరింత సమైక్యతతో, గట్టిగా స్పందిస్తుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అన్ని సామాజిక వర్గాలను గౌరవించే బాధ్యతను చేపట్టాలని కేజీఎఫ్ హెచ్చరించింది.

కేజీఎఫ్ నాయకులు కమ్మ సామాజిక వర్గం గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ.. "కమ్మ వర్గ చరిత్ర తెలియని వారు ఉంటే, మేము చరిత్ర పుస్తకాలు పంపిస్తాం. వాటిని చదివి కనీసం ఇకనైనా జ్ఞానం సంపాదించుకోవాలని కోరుతున్నాం. కమ్మ వారి చరిత్రను చిన్నచూపు చేస్తే, అది చిరస్థాయిగా నిలిచే సత్యం కాదు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి రైతు పోరాటాల వరకు, కమ్మ వారు అనేక రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. కాకని వెంకట రత్నం, ఎన్.జి. రంగా వంటి స్వాతంత్ర్య సమరయోధులు జైలు జీవితం గడిపి దేశానికి సేవ చేశారు. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం కోసం 1950 లోనే రాజా వాసిరెడ్డి, రామగోపాల కృష్ణ, మహేశ్వర ప్రసాద్ 55 లక్షల రూపాయలు, 5,000 ఎకరాల భూమిని దానం చేసి దేశాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన సామాజిక వర్గాన్ని అవమానించే ప్రయత్నాలు సహించం" అని స్పష్టం చేశారు.
సామాజిక న్యాయం కోసం కమ్మ వారి పోరాటం:
"కమ్మ సామాజిక వర్గం ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందుండి పోరాడే సంప్రదాయం కలిగిన వర్గం. బడుగు బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం కమ్మ వారు నిరంతరం కృషి చేశారు. ఈ చరిత్రను విస్మరించి, రాజకీయ స్వార్థం కోసం ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం నీతిబాహ్యం. కమ్మ వారు కేవలం ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గం కాదు; సమాజంలో సమైక్యత, కృషి, సేవలో ముందున్న బలమైన శక్తి," అని KGF పేర్కొంది.
సామాజిక సామరస్యం కోసం పిలుపు
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అన్ని సామాజిక వర్గాల గౌరవాన్ని కాపాడే రాజకీయ సంస్కృతి అవసరమని ఉద్ఘాటించింది. "సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెంపొందించాలంటే, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి తమ వ్యాఖ్యలను పునర్విమర్శించి, భవిష్యత్తులో అన్ని వర్గాలను గౌరవించే విధంగా మాట్లాడాలని కోరుతున్నాము. కమ్మ సామాజిక వర్గం సమాజ సేవ, కృషి, సమైక్యతలో ఎల్లప్పుడూ ముందుంటుంది," అని కేజీఎఫ్ నాయకులు తెలిపారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ నాయకులు సామాజిక వర్గాలను అవమానించకుండా, సామరస్యాన్ని పెంపొందించే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే, కమ్మ సమాజం తగిన రీతిలో స్పందిస్తుందని స్పష్టం చేసింది. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం అందరూ కలిసి పనిచేయాలని కేజీఎఫ్ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications