పులివెందులకు జగన్..! మూడు రోజుల టూర్- షెడ్యూల్ ఇదే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు మరోసారి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తున్నారు. ఇప్పటికే వరుస టూర్లతో బిజీగా ఉంటున్న జగన్.. పులివెందులలో పలు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. వీటికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్తున్నారు. జగన్ మూడు రోజుల టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను వైసీపీ అధికారికంగా విడుదల చేసింది.
రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి (బుధవారం) ఉదయం 9గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు.

అక్కడినుంచి జగన్ పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. తర్వాత అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 27వ తేదీన ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

గతేడాది ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులపై జగన్ పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఈసారి పులివెందులలోనూ గెలిచి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్యే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును వారు ఉదాహరణగా చూపుతున్నారు. దీంతో జగన్ తరచుగా పులివెందులలో పర్యటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి టూర్ లోనూ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications