వైఎస్సార్ కడప ఓకే.. ఎన్టీఆర్ విజయవాడ ఎప్పుడు ?..షర్మిల ప్రశ్న..!
ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థల పేర్లు మార్చడం సర్వసాధారణంగా జరుగుతున్నదే. అలాగే జిల్లాల పేర్లను కూడా గతంలో పలుమార్లు మార్చారు. ఇదే క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం మార్చిన వైఎస్సార్ జిల్లా పేరును మరోసారి మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.
కూటమి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపగా మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చిన కాసేపటికే ఎక్స్ లో షర్మిల దీనిపై స్పందించారు. మహానాడు ముచ్చటలో వైఎస్సార్ పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారని ఆక్షేపించారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. మహానేత మరణానంతరం కడప జిల్లాకు వైఎస్సార్ కడపగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ పేరుమీద కక్ష్యపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే, పేర్లు మార్పు వెనుక మీకు దురుద్దేశ్యం లేకుంటే, సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని వైఎస్ షర్మిల కోరారు. వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

వైఎస్సార్ , ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్న బిడ్డలేనని షర్మిల తెలిపారు. ప్రజల గుండెల్లో ఇద్దరిది సమాన స్థానమే అన్నారు. ఒకరికి ఒకలా, మరొకరి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications