జగన్ పై కోపంతో చంద్రబాబును రెచ్చగొడుతున్న షర్మిల? ఒక్కదెబ్బకు రెండు..!
ఏపీలో గత ఎన్నికలకు ముందు అన్న వైఎస్ జగన్ పై సమరం మొదలుపెట్టిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంతే కాదు రోజురోజుకీ మాటల దాడి పెంచుతున్నారు. జగన్ ను తిరిగి జైలుకు పంపడమే లక్ష్యంగా ఆమె ఇప్పుడు సీఎం చంద్రబాబును రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే షర్మిల లక్ష్యమేంటి ? అన్నపై పంతంతో చంద్రబాబును ఏ విషయంలో రెచ్చగొడుతున్నారో ఓసారి చూద్దాం..
గతంలో ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె సునీతతో కలిసి జగన్ ను పూర్తిగా టార్గెట్ చేసిన షర్మిల.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత బయటపడిన అదానీ సోలార్ ఒప్పందం విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు అదానీని, ఇటు వైఎస్ జగన్ ను వదలకుండా ఆమె విమర్శలకు దిగుతున్నారు. అయితే వీరిపై విమర్శల వరకూ అయితే సరే, కానీ ఇప్పుడు వీరిపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.

గతంలో కుదిరిన సెకీ ఒప్పందం విషయంలో జగన్ కు అదానీ లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టు నిర్ధారించినా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదనేది షర్మిల ఆవేదన. ఇదే అంశాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు, ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్ లోనూ అదానీ డీల్ పై చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట, సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట, బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అంటూ షర్మిల రెచ్చిపోయారు.
అక్కడితే ఆగకుండా నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారని చంద్రబాబును ప్రశ్నించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని నిలదీశారు. అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని అడిగారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారంటూ కడిగేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు. జగన్ కు తెలిసినా స్పందించరు.
అదానీపై @gautam_adani చర్యలకు చంద్రబాబు @ncbn గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని…
— YS Sharmila (@realyssharmila) January 23, 2025
ఇదంతా చూస్తుంటే అదానీని ఇప్పటికే టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనధికారిక బాస్ రాహుల్ గాంధీ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా చంద్రబాబు, జగన్ ను ఒకేసారి టార్గెట్ చేసి రాజకీయంగా కుదురుకోవాలనేది షర్మిల ప్లాన్ గా చెప్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు నోరు మెదపనంతవరకే ఏదైనా. ఒకసారి మాట్లాడితే మాత్రం షర్మిలకు అవకాశం ఇచ్చినట్లే.












Click it and Unblock the Notifications