తెలంగాణలో వైయస్ షర్మిల పరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో చేపట్టనున్న పరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. దివంగత సిఎం వైయస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.
ఈ పరామర్శ యాత్ర మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 8 సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల తన యాత్రను ప్రారంభించనున్నారు. మొదటగా బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలాలలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. అనంతరం 9వ తేదీ ఉదయం అమ్రాబాద్లో ఓ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అచ్చంపేటలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కౌలాపూర్లో రెండు కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
10వ తేదీన పెంటపల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రి దయార్లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శ యాత్రను ఆమె కొనసాగిస్తారు.
కొన్నూరు, కోసి, అమీన్కుంట, ఇండాపూర్లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. సాయంత్రం కోడంగల్లో బస చేస్తారు. 12వ తేదీన పెద ఎర్కిచర, గుండపాటవల్లి, నర్సప్పగూడ, మలాపూర్లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్నగర్ జిల్లా యాత్ర ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం షాద్నగర్ మీదుగా షర్మిల తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.