ఇడుపులపాయకు షర్మిల - అన్నతో కలుస్తారా : పాదయాత్రకు బ్రేక్..!!
వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఒక్క చోటకు చేరుతున్నారు. దివంగత వైఎస్సార్ జన్మదినం కావటంతో ఆయనకు నివాళి అర్పించేందుకు ఇడుపులపాయకు రానున్నారు. సీఎం జగన్ ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. ప్రారంభోత్సవాలకు హాజరవుతారు. ఈ సాయంత్రం సీఎం జగన్ ఇడుపుల పాయకు చేరుకుంటారు. రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్స్ లో బస చేస్తారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. ఈ సాయంత్రానికి ఇడుపులపాయకు రానున్నారు. అక్కడే ఉండి.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించనున్నారు.
కుటుంబ సభ్యులంతా కలిసి నివాళి
అనంతరం జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు. షర్మిల తెలంగాణలో రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలని.. పార్టీ ఏర్పాటు నిర్ణయంతో అన్న..సీఎం జగన్ విభేదించారు. అప్పటి నుంచి కొంత గ్యాప్ కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది. అయితే, వైఎస్సార్ జన్మదినం - వర్దంతి రోజున మాత్రం జగన్ - షర్మిల తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. ఆ రోజున వైఎస్సార్ కు నివాళి అర్పిస్తున్నారు. గత ఏడాది జగన్ - షర్మిల ఇద్దరూ కలిసి వైఎస్సార్ వర్దంతి నాడు కలిసి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు, విజయమ్మ కుమార్తె షర్మిల పాదయాత్ర.. రాజకీయ నిర్ణయాల్లో తోడుగా నిలుస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలను విజయమ్మ పలు మార్లు కలిసారు.
జగన్ - షర్మిల కలిసే తండ్రి ఘాట్ వద్ద
అయితే, తన తల్లి వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా తనను కలవటం లేదని .. తల్లిగా తనతో ఉంటున్నారంటూ రాజకీయ చర్చలకు షర్మిల ముగింపు పలికారు. ఇక, ఇప్పుడు వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ వైసీపీ ప్లీనరీకి హాజరు కానున్నారు. ప్లీనరీలో రెండో రోజు సమావేశంలో విజయమ్మ ప్రసంగం ఉండనుంది. వైసీపీ ఏర్పాటు సమయం నుంచి విజయమ్మ - షర్మిల ఇద్దరూ జగన్ ను తోడుగా నిలిచారు. వైసీపీ నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్యే సైతం విజయమ్మ. టీడీపీ - కాంగ్రెస్ తో విభేదించి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలను 2012 ఎన్నికల్లో విజయమ్మ - షర్మిల ప్రచారం చేసి గెలిపించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ రెండు స్థానాలు మినహా మిగిలినవి గెలుచుకొని కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
వైసీపీ ప్లీనరీకి విజయమ్మ
2019 ఎన్నికల్లోనూ ఈ ఇద్దరూ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. కానీ, ఏపీలో అధికారంలో ఉన్న తాము.. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనే విధానపరమైన నిర్ణయంతో జగన్..తన సోదరి పార్టీ ఏర్పాటు - రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ శ్రేణులతో పాటుగా .. వైఎస్సార్ అభిమానుల్లో జగన్ - షర్మిల ఎప్పుడూ కలిసినా ఆసక్తి కరమే. దీంతో..ఇప్పుడు ఇడుపుల పాయ వేదికగా ఈ ఇద్దరూ ఒకే చోటకు రానుండటంతో మరోసారి ఆసక్తి కనిపిస్తోంది. ఇడుపులపాయకు వచ్చేందుకు తాత్కాలికంగా తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన షర్మిల..తిరిగి ఈ నెల 10వ తేదీ నుంచి తన యాత్ర కొనసాగించనున్నారు.