పక్కా వ్యూహంతోనే షర్మిల- ఒకే అజెండాతో అటు జగన్-ఇటు బాబు, పవన్ ఫిక్స్?
ఏపీలో పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టాక మెరుపువేగంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న వైఎస్ షర్మిల ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని వ్యూహాత్మక అంశాలనే తెరపైకి తెస్తున్నారు. దీంతో అన్న జగన్, బీజేపీపై వ్యతిరేకత మాత్రమే ఎక్కువగా ఆమె మాటల్లో కనిపిస్తోంది. కానీ ఈసారి ఎన్నికల్లో కాకపోయినా ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంతోనే షర్మిల ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బీజేపీకి ఈసారి దక్షిణాది నుంచి ఎంపీ సీట్లు కూడా నామమాత్రంగా వచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడు, కేరళ, ఏపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమే. దీంతో కేవలం తెలంగాణ, కర్నాటక లక్ష్యంగా బీజేపీ ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే కర్నాటకలో అధికారం కోల్పోయాక, తెలంగాణలో విఫలమయ్యాక దక్షిణాదిలో బీజేపీ వ్యూహాలకు పూర్తిగా చెక్ పడినట్లయింది.

కానీ ఏపీలో మాత్రం పరిస్దితి వేరుగా ఉంది. ఇక్కడ బీజేపీకి ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా తాను అనుకున్న పనులన్నీ వైసీపీ, టీడీపీ వంటి పార్టీలతో కానిచ్చేస్తోంది. ఇప్పుడు వాటికీ బ్రేక్ వేయగలిగితే షర్మిల సక్సెస్ అయినట్లే. దీంతో వైఎస్ షర్మిల చూపంతా ఇప్పుడు బీజేపీ వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనకు చెక్ పెట్టడంపైనే ఉంది. అలాగే బీజేపీతో స్నేహం చేస్తూ కూడా మైనార్టీలు, ఇతర బీజేపీని వ్యతిరేకించే వర్గాల ఓట్ల సాయంతో అధికారం చెలాయిస్తున్న వైసీపీని దెబ్బతీయాలన్నది షర్మిల వ్యూహం.
రాష్ట్రంలో ఒకప్పుడు ఏమాత్రం ఆశల్లేని పరిస్దితుల్లో చంద్రబాబు సాయంతో ఎంట్రీ ఇచ్చి కొన్నీ సీట్లు గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సీట్లు లేకపోయినా తమకు నష్టం లేని పరిస్ధితికి వచ్చేసింది. దీంతో ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుగా, ఇంకా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండి ఆ తర్వాత వైసీపీకి మళ్లి ముస్లింలు, క్రైస్తవుల ఓట్లను తిరిగి కాంగ్రెస్ వైపుకు తెచ్చే లక్ష్యంతో షర్మిల అడుగులేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాటిని కాపాడుకోవడం ప్రధానంగా వైసీపీకి సవాల్ గా మారబోతోంది.
అలాగే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు చంద్రబాబు, పవన్ జోడీ కట్టారు. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటును అనివార్యంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ కూడా కొంత మేర చీల్చుకోబోతోంది. అలాగే వీరిద్దరూ బీజేపీ మిత్రులన్న అంశాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్తే సమస్యలు తప్పవు. కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న నేతలతో పోలిస్తే షర్మిల జనాకర్షణ కారణంగా ఇతర పార్టీల్లో టికెట్లు దొరకని నేతలు ఆ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఓటు బ్యాంక్ పూర్తిగా మళ్లకపోయినా కొన్ని ఓట్లు చీల్చినా రేపు విపక్షాలకు కచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఇలా అధికార, విపక్షాలకు డెంట్ పెట్టేందుకు షర్మిల వేస్తున్న అడుగుల్ని ఎవరూ విస్మరించలేని పరిస్ధితి.












Click it and Unblock the Notifications