జగన్-షర్మిల మధ్య అగాధం: పార్టీ పెట్టడానికి కారణం ఇదే: విజయమ్మ హస్తం:: ఆయన చేతుల్లో: టీడీపీ నేత
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పబోతోన్నారంటూ కొద్దిరోజులుగా రాష్ట్రంలో చెలరేగుతోన్న ఊహాగానాలకు తెర పడట్లేదు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతోన్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైఎస్ షర్మిల తేల్చి చెప్పిన తరువాత కూడా.. దానికి సంబంధించిన చర్చకు బ్రేక పడట్లేదు. కారణాలేమైనప్పటికీ- ఈ అంశాన్ని కొన్నాళ్ల పాటు సజీవంగా ఉంచదలచుకుంటున్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఎస్సార్సీపీపై ఎదురుదాడి చేయడానికి వినియోగించుకోనున్నట్లు స్పష్టమౌతోంది.
ఇప్పటికే రిజిస్టర్ కూడా..
వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమేనంటూ తెలుగుదేశం సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యుడు సబ్బం హరి వెల్లడించారు. దీనిపై తనకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీని రిజిస్టర్ కూడా చేయించారని, లాంఛనప్రాయంగా ప్రారంభించడానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఏకపక్ష వైఖరి.. ఆయన కుటుంబంలో విభేదాలకు దారి తీస్తోందని ఈ డిబేట్ సందర్భంగా సబ్బం హరి ప్రస్తావించారు.
విజయమ్మ హస్తం..
వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం వెనుక ఆమె తల్లి విజయమ్మ పాత్ర ఉందని తాను భావిస్తున్నట్లు సబ్బం హరి చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తన కుమార్తెకు భాగస్వామ్యాన్ని కల్పించకపోవడం పట్ల విజయమ్మ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తామని మొదట్లో వైఎస్ జగన్ చెల్లెలికి హామీ ఇచ్చి.. అనంతరం దాన్ని విస్మరించారనే అసంతృప్తి విజయమ్మ-షర్మిలల్లో వ్యక్తమౌతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే జగన్-షర్మిల మధ్య అగాథం ఏర్పడిందని అన్నారు.
నిమ్మగడ్డపై దాడి రాజ్యాంగ విరుద్ధం..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. జగన్ సర్కార్ చేస్తోన్న దాడి రాజ్యాంగ విరుద్ధమని సబ్బం హరి విమర్శించారు. దీన్ని రాజ్యాంగంపై చేపట్టిన దాడిగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును మేధావులు సమర్థించబోరని అన్నారు. రమేష్ కుమార్తో నెలకొన్న వివాదంలో జగన్ సర్కార్కు అన్నీ ప్రతికూల ఫలితాలే ఎదురు కావడం ప్రజాస్వామ్యం విజయం సాధించిందనడానికి నిలువెత్తు సాక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషించాని అన్నారు.
మచ్చలేని కేరీర్..
ఐఎఎస్ అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మచ్చలేని కేరీర్ ఉందని సబ్బం హరి కితాబిచ్చారు. సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. అలాంటి నిమ్మగడ్డపై కొంతమంది రాజకీయ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు, విమర్శలు అత్యంత దారుణమని అన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, జగన్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందంటూ గవర్నర్ లేఖ రాస్తే.. ప్రభుత్వం కుప్పకూలుతుందని సబ్బం హరి అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని చెప్పారు.