ys Sharmila vs Rk Roja: స్క్రిప్ట్ మీదేనా, ఆయనదా ? రోజాకు షర్మిల ఘాటు కౌంటర్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ సెకీతో జరిగిన ఒప్పందంపై వైఎస్ జగన్ తాజాగా వివరణ ఇచ్చినా రాజకీయంగా రచ్చ మాత్రం ఆగడం లేదు. జగన్ వివరణపై ఆయన చెల్లెలు, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించగా.. వైసీపీ నేత ఆర్కే రోజా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. దీనికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ హ్యాండిల్ షర్మిల మరో కౌంటర్ ఇచ్చారు.
గౌరవ మాజీ మంత్రి రోజా గారు.. ఇంతకు ఇది మీ రాతలా ? సాక్షి పంపిన స్క్రిప్టా ? లేక సకల శాఖ మాజీ మంత్రి రాసిందా? తెర వెనుక దాక్కొని మిమ్మల్ని ముందుపెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతుందని వైఎస్ షర్మిల ఇందులో ఆమెను ప్రశ్నించారు. దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు చేశారని, 5 ఏళ్ల తర్వాత రూ 1.50 పైసలకే యూనిట్ ధర వచ్చునేమో కదా అని ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద రూ.2.49 పైసలకు ఎందుకు కొన్నారని, అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. 2020 లో గుజరాత్లో సోలార్ యూనిట్ ధర కేవలం రూ 1.99 పైసలు మాత్రమేనని, మరి వెనకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొనాల్సి వచ్చిందని అడిగారు. ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా అన్నారు.
అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ చార్జీలు లేవని, రూ 2.49 పైసలకే యూనిట్ ధర పడిందని చెప్పినా వీలింగ్ ఛార్జీలు, GST అన్ని కలిపి యూనిట్కి రూ. 4.16 పైసలు పడుతుందని విద్యుత్ రంగ అధికారులే చెప్తున్నారని, ఇది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో సెకీ, NTPC సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్కి పిలిచిన టెండర్లలో రూ. 2.14 పైసలకే పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్న సంగతి మీకు తెలియదా అని అడిగారు. 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్యా అనే సోలార్ కంపెనీ రూ.2.14 పైసలకు, ఏఐ జోమయ్య అనే కంపెనీ రూ.2.15 పైసలు కోట్ చేసిన సంగతి మీరు గమనించలేదా అని అడిగారు.
2021లో రాజస్థాన్లో NTPC రెన్యువల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లలో యూనిట్ ధర రూ. 2.17 పైసలకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి మీరు చూడలేదా అని రోజాను షర్మిల ప్రశ్నించారు. గుజరాత్లో రూ 1.99 పైసలు, రాజస్థాన్లో రూ 2.17 పైసలు, మధ్యప్రదేశ్లో రూ 2.14 పైసలు, మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూ. 2.49 పైసలు పెట్టి కొనడం తక్కువ ధరనా ? ఇదెక్కడి బంపర్ ఆఫర్ అని నిలదీశారు.
చంద్రబాబు హయాంలో సోలార్ పవర్కి ఎక్కువ పెట్టి కొన్నారు అంటున్నారు. 2019లో మీరు అధికారంలో వచ్చాకా దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదని ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేశారు సరే.. మరి దాని వెనుక మర్మం ఏంటో విచారణ చేయాలి కదా ? 5 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అని కడిగి పారేశారు? అటు తిప్పి,ఇటు తిప్పి ఇంగ్లీష్లో చెప్పినా, తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయలేరన్నారు. అదానీ దగ్గర మీరు రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నది వాస్తమమని, దేశంలో ఎవడు కొనని అదానీ సోలార్ పవర్ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవమని తేల్చేశారు.












Click it and Unblock the Notifications